తెగిన బీజేపీ-జేజేపీ పొత్తు: హర్యానాలో రాజకీయ సంక్షోభం!

by Dishanational2 |
తెగిన బీజేపీ-జేజేపీ పొత్తు: హర్యానాలో రాజకీయ సంక్షోభం!
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు ఎన్నికలకు ముందు హర్యానాలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ, దుష్యంత్ చౌతాలాకు చెందిన జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. దీంతో జేజేపీ తమ మద్దతును ఉనసంహరించుకోనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. పార్లమెంటు ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జేజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం. రాష్ట్రంలో మొత్తం10 స్థానాలకు గాను రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు జేజేపీ ఆసక్తి చూపగా..జేజేపీకి ఎంపీ సీట్లు ఇవ్వడానికి బీజేపీ నిరాకరించినట్టు తెలుస్తోంది.

అయితే తాజా పరిణామాల నేపథ్యంలో జేజేపీ తన మద్దతును ఉపసంహరించుకుంటే స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన రాజీనామాను సమర్పించేందుకు మంగళవారం గవర్నర్ బండారు దత్తాత్రేయను కలవనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే మళ్లీ ముఖ్యమంత్రిగా ఖట్టరే ప్రమాణ స్వీకారం చేస్తారా, లేదా మరెవరైనా నియమితులవుతారా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. బీజేపీ సైతం శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీకి 41, కాంగ్రెస్ 30 , జేజేపీ10, ఐఎన్‌ఎల్‌డీ 1, హెచ్‌ఎల్‌పీ 1, స్వతంత్రులు ఏడుగురు ఉన్నారు. మెజారిటీకి 46 సీట్లు కావాల్సి ఉంది. ప్రస్తుతం బీజేపీ-జేజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో 41 మంది బీజేపీ సభ్యులు,10 జేజేపీ, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. జేజేపీ కూటమి నుంచి తప్పుకుంటే బీజేపీ 41, స్వత్రంత్రులు ఏడుగురితో కలిపితే 48 మంది సభ్యుల మద్దతు లభిస్తుంది. దీంతో మెజారిటీకి రెండు సీట్ల ఆధిక్యంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

Next Story

Most Viewed