- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పశ్చిమ బెంగాల్కు ఉజ్వల భవిష్యత్తు.. సీఎం చంద్రబాబు నాయుడు ధీమా!
ప్రధాని మోడీ నాయకత్వంలో 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని, బెంగాల్ భవిష్యత్తు ఉజ్వలంగా మారబోతుందని ముంబైలో సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

దిశ, వెబ్డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమర్థవంతమైన నాయకత్వంలో భారతదేశం అంతర్జాతీయంగా అపారమైన గౌరవాన్ని సంపాదించుకుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. ముంబై పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థిక మందగమనాన్ని, సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, భారతదేశం మాత్రం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ నాయకత్వం వల్లే ఇది సాధ్యమవుతోందని హర్షం వ్యక్తం చేసిన ఆయన.. 2047 నాటికి భారతదేశం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో 'అభివృద్ధి చెందిన దేశం' (Developed Nation) గా అవతరిస్తుందనే పూర్తి నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అమలు కాబోతున్న యూనిఫాం సివిల్ కోడ్ (UCC) పరిణామాలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా మూసుకుపోయిన పశ్చిమ బెంగాల్ అభివృద్ధి తలుపులు ఇప్పుడు తెరుచుకున్నాయని (Unlocked) ఆయన వ్యాఖ్యానించారు. "గతంలో 'బెంగాల్ ఈ రోజు ఆలోచించేది.. దేశం రేపు ఆలోచిస్తుంది' అనే ఒక సామెత ఉండేదని, కానీ ఈ మధ్య కాలంలో బెంగాల్ ఆలోచించడం మానేసిందని.. అయితే ఇప్పుడు మళ్లీ ఆలోచించడం మొదలుపెట్టిందని" పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో అపారమైన మానవ వనరులు, అవకాశాలు ఉన్నాయని.. రాబోయే రోజుల్లో ఆ రాష్ట్ర భవిష్యత్తు అత్యంత ఉజ్వలంగా, ప్రకాశవంతంగా మారబోతోందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.






