డీలిమిటేషన్‌పై డీఎంకే ఆందోళన

by Ajay Maddhiboyina |

లోక్‌సభలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. డీఎంకే సభ్యుల నినాదాలపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

డీలిమిటేషన్‌పై డీఎంకే ఆందోళన
X

- ఉభయ సభల్లో గందరగోళం

- శుక్రవారం వరకు లోక్, రాజ్యసభల వాయిదా

దిశ, నేషనల్ బ్యూరో: అసంబద్ద డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ డీఎంకే సభ్యులు ఇరు సభల్లో ఆందోళన చేపట్టారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా టీ-షర్టులు ధరించి, నినాదాలు చేశారు. లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ డీఎంకే ఎంపీల కారణంగా గురువారం పదే పదే సభలు వాయిదా పడ్డాయి. చివరకు శుక్రవారం వరకు ఉభయ సభలను వాయిదా వేశారు. రాజ్యసభలోతొలుత సభాకార్యకలాపాలు డీఎంకే ఎంపీల కారణంగా గందరగోళంగా మారాయి. దీంతో చైర్మన్ జగదీప్ ధన్‌కర్ మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. ఈ విషయంపై ఫ్లోర్ లీడర్లతో సంప్రదిస్తానని చెప్పారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత మళ్లీ 15 నిమిషాలు వాయిదా పడింది. ఆ తర్వాత కూడా నిరంతర అంతరాయాలు ఏర్పడటంతో షెడ్యూల్ చేసిన కార్యాకలాపాలపై చర్చ జరగకుండానే సభ వాయిదా పడింది.

లోక్‌సభలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. డీఎంకే సభ్యుల నినాదాలపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభను పలుమార్లు వాయిదా వేసినా డీఎంకే సభ్యుల నిరసనలు తగ్గలేదు. దీంతో శుక్రవారం వరకు సభను వాయిదా వేస్తున్నట్లు ఓం బిర్లా ప్రకటించారు. డీఎంకే ఎంపీల టీషర్టులపై ఉన్న 'డీలిమిటేషన్ - తమిళనాడు పోరాడుతుంది.. తమిళనాడు గెలుస్తుంది' అని ఉన్న నినాదాలపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ అంశాన్ని వివరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీని వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం తగ్గే అవకాశం ఉందని డీఎంకే ఎంపీలు వాదిస్తున్నారు.

సభలు వాయిదా పడిన తర్వాత డీఎంకే ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా బ్యానర్లు పట్టుకొని ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, అందుకే డీఎంకే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఉభయ సభలలో పదే పదే జరుగుతున్న అంతరాయాల కారణంగా కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో రాజ్యసభ ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకుండానే వాయిదా పడటం ఇదే మొదటిసారి.

Next Story