BREAKING: యమునా నదిలో ఘోర ప్రమాదం.. 25 మంది జలసమాధి ?

by Naga Rani Yarlagadda |

యమునా నదిలో ఘోర ప్రమాదం జరిగింది. 25 మంది యాత్రికులతో వెళ్తున్న పడవ బ్రిడ్జిని ఢీ కొని బోల్తా పడింది.

BREAKING: యమునా నదిలో ఘోర ప్రమాదం.. 25 మంది జలసమాధి ?
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథురా జిల్లాలోని బృందావన్‌లో భారీ పడవ ప్రమాదం సంభవించింది. యమునా నదిలోని కేసీ ఘాట్ సమీపంలో యాత్రికులు, స్థానికులతో వెళ్తున్న ఒక పడవ.. నదిపై ఉన్న తాత్కాలిక వంతెనను (Pipa Bridge) బలంగా ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో పడవలో సుమారు 25 మంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక మత్స్యకారులు, పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటివరకు ఒకరిని సురక్షితంగా బయటకు తీయగా, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా యంత్రాంగం.. గజ ఈతగాళ్లతో సహాయక చర్యలను వేగవంతం చేసింది. గల్లంతైన వారిలో ఎక్కువ మంది ఇతర ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులే ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదానికి కారణం అదేనా?

ప్రమాదం జరిగిన సమయంలో పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉన్నారా లేదా కేవలం వంతెనను ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. యమునా నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటం, తాత్కాలిక వంతెన అడ్డుగా రావడంతో పడవ అదుపు తప్పి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాద వార్త తెలియగానే ఘాట్ వద్దకు భారీగా జనం చేరుకున్నారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాల సహాయం కూడా కోరినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో ఎంతమంది సేఫ్ గా ఉన్నారన్నదానిపై స్పష్టత రావలసి ఉంది. ఇప్పటి వరకూ ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు.

Next Story