- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ‘భ్రూణ హత్యే’.. విపక్షాలపై నిప్పులుచెరిగిన ప్రధాని మోడీ
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల తీరును ప్రధాని మోదీ 'భ్రూణ హత్య'తో పోల్చారు.

దిశ, వెబ్డెస్క్: దేశాభివృద్ధిలో మహిళల పాత్రను గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. విపక్షాల వైఖరిని ఎండగట్టారు. భారత మహిళల దశాబ్దాల కలలను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చిదిమేశాయని మోడీ మండిపడ్డారు.
వారికి దేశ హితం కంటే రాజకీయాలే ముఖ్యం
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న తీరును ప్రధాని మోదీ అత్యంత కఠినమైన పదజాలంతో విమర్శించారు. "రాజకీయ స్వార్థం కోసం చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం దక్కకుండా చేయడం ఒక 'భ్రూణ హత్య'తో సమానం. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే పార్టీలు చేసిన ఈ పాపం వారిని వదిలిపెట్టదు. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత మహిళలకు దక్కాల్సిన హక్కును కాలరాయడం దారుణం" అని ఆయన అన్నారు. మహిళల సంక్షేమం కోసం తాను ఎంతలా ప్రయత్నించారో ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. "నేను స్వయంగా అన్ని పార్టీల నేతలతో మాట్లాడాను. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని, అవసరమైతే ఈ ఘనత (Credit) మొత్తం మీరే తీసుకోండని కూడా విజ్ఞప్తి చేశాను. కానీ వారికి దేశ హితం కంటే రాజకీయాలే ముఖ్యం అని తేలిపోయింది. విపక్షాలు ఓడించింది బిల్లును కాదు.. మహిళా శక్తిని" అని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు.
డీలిమిటేషన్పై విష ప్రచారం..
నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై కాంగ్రెస్ కావాలనే అబద్ధాలు ప్రచారం చేస్తోందని ప్రధాని మండిపడ్డారు. "డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి నష్టం ఉండదని మేము పదే పదే హామీ ఇచ్చాం. దీనివల్ల అన్ని రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు పెరుగుతాయి. తద్వారా అన్ని పార్టీలకు రాజకీయ ప్రయోజనం ఉంటుంది. కానీ మార్పును వ్యతిరేకించడమే కాంగ్రెస్ సిద్ధాంతం" అని ప్రధాని స్పష్టం చేశారు.
నెగటివ్ రాజకీయాల అడ్డాగా కాంగ్రెస్
సంస్కరణలను అడ్డుకోవడమే కాంగ్రెస్ నైజమని ప్రధాని ఎద్దేవా చేశారు. గతంలో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి అంశాలను కూడా కాంగ్రెస్ ఇలాగే వ్యతిరేకించిందని గుర్తుచేశారు. ఉగ్రవాదం, నక్సలిజం విషయంలో కూడా ఆ పార్టీది నెగటివ్ వైఖరి అని, వారి విధానాల వల్ల దేశానికి తీవ్ర నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజ్వాదీ పార్టీ (SP) తన వ్యవస్థాపకుడు లోహియా స్వప్నాలను తుంగలో తొక్కిందని ప్రధాని ఆరోపించారు. "మహిళా లోకం అంతా నేడు దుఃఖంలో ఉంది. తమ హక్కులను అడ్డుకున్న కుటుంబ పార్టీలకు రాబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో మహిళలే గట్టిగా బుద్ధి చెప్పాలి. భారత నారీ శక్తిని తక్కువగా అంచనా వేయకండి.. తస్మాత్ జాగ్రత్త!" అంటూ ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ముగించారు.






