ఆ పని చేసినందుకు.. మన్మోహన్ సింగ్‌కు బీజేపీ క్షమాపణ చెప్పాలి : రౌత్

by Dishanational4 |
ఆ పని చేసినందుకు.. మన్మోహన్ సింగ్‌కు బీజేపీ క్షమాపణ చెప్పాలి : రౌత్
X

దిశ, నేషనల్ బ్యూరో : మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్‌కు బీజేపీ క్షమాపణలు చెప్పాలని శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్‌ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ఎయిరిండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్ సంస్థలు విలీనమై నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే కొత్త కంపెనీ ఏర్పడింది. ఆ కంపెనీ ద్వారా జరిగిన విమానాల లీజు కాంట్రాక్టుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ కేంద్రంలోని మోడీ సర్కారు సీబీఐతో దర్యాప్తు చేయించిందని, చివరకు అలాంటిదేం లేదని తేలిందని రౌత్ చెప్పారు. ఆ కేసును మూసివేస్తున్నట్లుగా ప్రకటిస్తూ ఇటీవల సీబీఐ క్లోజర్ రిపోర్టును కూడా దాఖలు చేసిందని ఆయన గుర్తుచేశారు. ఈనేపథ్యంలో మచ్చలేని నాయకుడు మన్మోహన్ సింగ్‌కు క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు. ప్రస్తుతం బీజేపీకి మిత్రుడిగా మారిన అజిత్ పవార్ వర్గంలోని నాయకుడు ప్రఫుల్ పటేలే ఆనాడు మన్మోహన్ హయాంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా వ్యవహరించారని తెలిపారు.



Next Story

Most Viewed