కాంగ్రెస్‌ను బలహీనపర్చేందుకు బీజేపీ కుట్ర: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

by Dishanational2 |
కాంగ్రెస్‌ను బలహీనపర్చేందుకు బీజేపీ కుట్ర: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని బలహీనపరిచేందుకు ఐటీ శాఖ, ఈడీ, సీబీఐ వంటి సంస్థలను బీజేపీ ఉపయోగిస్తోందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను వాడుకుని ఎన్నికల్లో గెలవాలను కోవడం మూర్ఖత్వమే అవుతుందని తెలిపారు. ఓటమి భయంతోనే బీజేపీ ఈ తరహా చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. స్వయం ప్రతిపత్తి గల సంస్థలను పూర్తిగా దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆదాయపు పన్ను శాఖ మరింత చురుగ్గా వ్యవహరిస్తోందని, ప్రతిపక్ష పార్టీలపై ట్యాక్స్ టెర్రరిజాన్ని ప్రయోగిస్తోందని తెలిపారు. బీజేపీ మాత్రం పన్నులను ఎగ్గొడుతుందని చెప్పారు. కర్ణాటకలో దొరికిన యడియూరప్ప డైరీలను, నరేంద్ర మోడీకి లాభాలు వచ్చినట్లు సూచించే ‘బిర్లా-సహారా’ డైరీని ఐటీ శాఖ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అధికార బీజేపీ వేల కోట్లు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటి మోసగాళ్లకు గత ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం రూ. 10.09 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేసిందని తెలిపారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో సిద్ధరామయ్య పై వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed