కమలం గుర్తుకు ఓటేయకుండా కుట్ర.. ఈవీఎంలలో మాయాజాలం.. బీజేపీ సీరియస్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-29 06:53:56  IST  )

పశ్చిమ బెంగాల్ లో మలివిడత ఎన్నికలు జరుగుతుండగా.. తన మేనల్లుడిని గెలిపించుకునేందుకు మమతా బెనర్జీ కుట్ర చేసిందని బీజేపీ ఆరోపిస్తోంది.

కమలం గుర్తుకు ఓటేయకుండా కుట్ర.. ఈవీఎంలలో మాయాజాలం.. బీజేపీ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పలు పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVM)పై బీజేపీ అభ్యర్థి గుర్తు అయిన ‘కమలం’ను ఉద్దేశపూర్వకంగా బ్లాక్ చేశారని బీజేపీ జాతీయ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అమిత్ మాలవీయ సంచలన ఆరోపణలు చేశారు.

టేప్‍తో గుర్తును మూసేశారన్న మాలవీయ

డైమండ్ హార్బర్‌లోని పలు బూత్‌లలో ఓటర్లు బీజేపీకి ఓటు వేయకుండా అడ్డుకోవడానికి, కమలం గుర్తుపై టేప్ అంటించి ఓటు వేయకుండా చేశారని మాలవీయ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆయన ఎక్స్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. "మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని గెలిపించుకోవడానికి అనుసరిస్తున్న ‘డైమండ్ హార్బర్ మోడల్’ ఇదేనా?" అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. ఫాల్టా అసెంబ్లీ సెగ్మెంట్‌లోని బూత్ నంబర్ 170 (హరిందంగా హై స్కూల్), బూత్ నంబర్ 189 వంటి పలు కేంద్రాల్లో ఈ అక్రమాలు జరిగాయని ఆయన ఆధారాలతో సహా వివరించారు.

రీపోలింగ్‌కు డిమాండ్.. స్పందించిన ఈసీ

టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ వంటి నేతల అండతోనే ఇటువంటి అక్రమాలు జరుగుతున్నాయని, ఓటర్ల స్వేచ్ఛను హరించిన ఫాల్టాలోని ప్రభావిత బూత్‌లన్నింటిలో తక్షణమే రీపోలింగ్ నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ ఫిర్యాదుపై పశ్చిమ బెంగాల్ ఎన్నికల కమిషనర్ తక్షణమే స్పందించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులతో దర్యాప్తు జరుపుతున్నామని, నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.

Next Story