బిహార్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. సీఎం పదవికి నితీష్ రాజీనామా?

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-04 13:00:19  IST  )

బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆయన పదవికి రాజీనామా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. జేడీయూ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

బిహార్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. సీఎం పదవికి నితీష్ రాజీనామా?
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. గత రెండు దశాబ్దాలుగా స్టేట్ పాలిటిక్స్‌ను శాసిస్తున్న సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. తన కెరీర్‌లో వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించిన నితీష్, ఇప్పుడు తన కుమారుడు నిశాంత్ కుమార్‌ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లుగా జాతీయ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే, తాజా పరిణామం బిహార్‌లో చర్చనీయాంశంగా మారింది.

నిశాంత్ కుమార్‌కు రాజ్యసభ సీటు?

జేడీయూ వర్గాల సమాచారం ప్రకారం.. నిశాంత్ కుమార్ త్వరలోనే రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన రాజకీయ రంగ ప్రవేశం దాదాపు ఖరారైంది. స్వతహాగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన నిశాంత్, ఇప్పటి వరకు పాలిటిక్స్ దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ, జేడీయూ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, పార్టీ క్యాడర్‌లో నూతనోత్సాహం నింపడానికి ఆయనే సరైన వారసుడని నితీష్ కుమార్ భావిస్తున్నట్లుగా జేడీయూ వర్గాల్లో జోరుగా తెలుస్తోంది.

బీజేపీతో అధికార మార్పిడి ఒప్పందం

2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ 89 సీట్లుతో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవతరించింది. దీంతో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన వ్యక్తే ఉండాలనే డిమాండ్ పెరిగింది. దీనిలో భాగంగానే నితీష్‌ను కేంద్రానికి పంపి, బిహార్ పగ్గాలను బీజేపీకి అప్పగించేలా అంతర్గత ఒప్పందం జరిగినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే నితిన్ నబీన్ వంటి నేతల పేర్లు ముఖ్యమంత్రి రేసులో వినిపిస్తున్నాయి.

నితీష్ కేంద్ర కేబినెట్‌లోకి..

నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసి, రాజ్యసభ నుంచి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం ఉందని జాతీయ మీడియా కోడై కూస్తోంది. త్వరలోనే ఆయన ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరపబోతున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా అనుభవజ్ఞుడైన నితీష్ కుమార్ కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుని ఆయన సేవలను ఉపయోగించుకోవాలని ఎన్డీయే కూడా భావిస్తోంది.

పార్టీని బలోపేతం చేసుకునేందుకేనా..!

జేడీయూలో నితీష్ తర్వాత సరైన నాయకుడు లేకపోవడం పార్టీకి బలహీనతగా మారింది. ఆ విషయం ఇటీవలే జరిగిన అసెంబ్లీలో ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా తెలుస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్ వారసుడిగా తేజస్వీ యాదవ్ నిలదొక్కుకున్నట్లే, తన కుమారుడు నిశాంత్ కుమార్‌ను రంగంలోకి దించడం ద్వారా పార్టీని కాపాడుకోవాలని నితీష్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అనుకున్నట్లుగానే ఒకవేళ నిశాంత్ కుమార్ నామినేషన్ దాఖలు చేస్తే, బిహార్బిహార్ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైనట్లేనని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. రాష్ట్రంలో చోటుచేసుకోబోయే మార్పులతో జేడీయూ బలపడుతుందా.. లేక అంతర్గత విభేదాలు పుట్టుకొస్తాయా అనేది వేచి చూడాల్సిందే మరి.

Next Story