కర్ణాటక ఎన్నికల వేళ గాలి జనార్దన్ రెడ్డికి బిగ్ షాక్!

by Disha Web Desk 4 |
కర్ణాటక ఎన్నికల వేళ గాలి జనార్దన్ రెడ్డికి బిగ్ షాక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కండిషన్‌లను సడలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తనకు బళ్లారి వెళ్లేందుకు అకాశం కల్పించాలని, అందుకు అనుగుణంగా తన బెయిల్ నిబంధనలను సడలించాలని గాలి జనార్ధన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేష్ ల ధర్మాసనం.. గాలి జనార్దన్ రడ్డి విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ బెయిల్ నిబంధనలు సడలించడం కుదరదని తేల్చిచెప్పింది.

ఎన్నికలు ముగిసిన తర్వాత మరోసారి కోర్టుకు వచ్చేందుకు అవకాశం ఇస్తూ పిటీషన్ వెనక్కి తీసుకునే వెసులుబాటు కల్పించాలన్న గాలి తరపు న్యాయవాది విజ్ఞాపనను కూడా ధర్మాసనం తిరస్కరిస్తూ జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఇదిలా ఉంటే ఇటీవల కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్‌పీపీ)ని స్థాపించిన గాలి జనార్ధన్ రెడ్డి వచ్చే నెలలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ బరిలో పార్టీ తరపున తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గంగావతి నియోజకవర్గం నుంచి ఆయన మంగళవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు.

Next Story

Most Viewed