మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్: బీజేపీలో చేరిన కీలక నేతలు

by Dishanational2 |
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్: బీజేపీలో చేరిన కీలక నేతలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు ఎన్నికల ముందు మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు కీలక నేతలు శనివారం బీజేపీలో చేరారు. కాషాయ పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ పచౌరీ, మాజీ ఎంపీ గజేంద్ర సింగ్ రాజుఖేడి, మాజీ ఎమ్మెల్యేలు సంజయ్ శుక్లా, అర్జున్ పలియా, విశాల్ పటేల్‌లు ఉన్నారు. వీరంతా సీఎం మోహన్ యాదవ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ల సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వచ్చిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. సురేశ్ పచౌరీ పార్టీని వీడటంతో కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ తగిలినట్టు అయింది. ఈ నెల 7న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పచౌరీ తన రాజీనామా లేఖను అందజేశారు. ‘మధ్యప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలక వ్యక్తి బీజేపీలో చేరారు. రామమందిర ఆహ్వానాన్ని తిరస్కరించిన వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి’ అని బీజేపీ చీఫ్ వీడీ శర్మ తెలిపారు.

పచౌరీ కాంగ్రెస్ అత్యంత సీనియర్ నేతల్లో ఒకరు. గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా పేరు పొందారు. 1972లో రాజకీయాల్లోకి ప్రవేశించిన పచౌరీ..మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. 1984లో మొదటి సారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1990, 1996, 2002లోనూ పెద్దల సభకు నామినేట్ అయ్యారు. 1995-96 మధ్య కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. 2008 నుంచి 2011 వరకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌గానూ విధులు నిర్వర్తించారు. ఇక, పచౌరీ మద్దతు దారుడైన సంజయ్ శుక్లా ఇండోర్ కాంగ్రెస్‌కు చెందిన అత్యంత ధనిక మాజీ ఎమ్మెల్యే. ఓ వైపు బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పోరాడుతుంటే.. పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడటం ఆందోళన కలిగిస్తోంది.


Next Story

Most Viewed