బెంగళూరులో నీళ్లు వృధా చేసినందుకు 22 కుటుంబాలపై రూ. 5 వేలు చొప్పున ఫైన్

by Dishanational1 |
బెంగళూరులో నీళ్లు వృధా చేసినందుకు 22 కుటుంబాలపై రూ. 5 వేలు చొప్పున ఫైన్
X

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరు ప్రజలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల నీళ్లను వృధా చేసిన వారిపై జరిమానా విధిస్తామని అధికారులు సైతం ప్రకటన జారీ చేశారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని 22 కుటుంబాలపై ఒక్కొక్కరికీ రూ. 5,000 జరిమానా విధించినట్టు సమాచారం. తీవ్రమైన నీటి కొరత సమయంలో కావేరి నీటిని అనవసరంగా వాడుకున్నందుకు వారికి ఫైన్ విధించగా, బెంగళూరు వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డు(బీడబ్ల్యూఎస్ఎస్‌బీ) 22 కుటుంబాల నుంచి రూ. 1.10 లక్షలను వసూలు చేసింది. ఆయా కుటుంబాలు కార్లను శుభ్రపరచడం, తోటపని చేయడం వంటి అనవసరమైన వాటికి త్రాగునీటిని ఉపయోగిస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదులతో చర్యలు తీసుకున్నట్టు బీడబ్ల్యూఎస్ఎస్‌బీ అధికారులు తెలిపారు. బీడబ్ల్యూఎస్ఎస్‌బీ సౌత్ డివిజన్ నీటి వృధాపై కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తోంది. ఇదివరకే తీవ్రమైన నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని హోలీ వేడుకల సందర్భంగా పూల్ డ్యాన్స్, రెయిన్ డ్యాన్స్ వంటి కార్యక్రమాలకు కావేరి నీరు, బోర్‌వెల్ నీటిని ఉపయోగించడాన్ని బీడబ్ల్యూఎస్ఎస్‌బీ నిషేధించింది. అలాగే, వివిధ సంస్థలు, అపార్ట్‌మెంట్‌లు, లగ్జరీ హోటళ్లు, పరిశ్రమలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా నీటి వృద్ధాను నియంత్రించే ఎరేటర్‌లను ఏర్పాటును తప్పనిసరి చేసింది. మరోవైపు, నగరంలో ఎండిపోయిన సరస్సులను శుద్ధి చేసిన మురుగునీటితో నింపడం ద్వారా బెంగళూరు నీటి సరఫరా బోర్డు చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. దీనివల్ల వేసవికి ముందు బోర్‌వెల్‌లను రీఛార్జ్ చేయడంలో సహాయపడటం, తద్వారా నీటి కొరతను తగ్గించవచ్చని భావిస్తోంది.



Next Story

Most Viewed