గిరిజన సమాజంలో పుట్టడం.. ప్రతికూలత కానేకాదు : ద్రౌపది ముర్ము

by Disha Web Desk 13 |
గిరిజన సమాజంలో పుట్టడం.. ప్రతికూలత కానేకాదు : ద్రౌపది ముర్ము
X

ఖుంటి (జార్ఖండ్): మహిళగా బతకడం, గిరిజన సమాజంలో పుట్టడం వల్ల ఎలాంటి నష్టం లేదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సామాజిక సంస్కరణలు, రాజకీయాలు, ఆర్థికం, విద్య, సైన్స్, పరిశోధన, వ్యాపారం, క్రీడలు, సైనిక దళాలు.. ఇలా దేశంలోని ఎన్నో రంగాల్లో మహిళల అమూల్యమైన కృషి మర్చిపోలేనిదన్నారు. గురువారం జార్ఖండ్ లోని ఖుంటిలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన మహిళా సదస్సులో ముర్ము ప్రసంగించారు. మహిళలు తమలో ఉన్న అనంతమైన శక్తిని మేల్కొల్పాలని కోరారు.

ఏదైనా రంగంలో విజయం సాధించాలంటే వారి ప్రతిభను గుర్తించడం చాలా కీలకమని, ఇతరుల స్థాయిని బట్టి తమను తాము అంచనా వేయకూడదని పేర్కొన్నారు. మహిళా సాధికారతలో సామాజిక, ఆర్థిక అంశాలు ముఖ్యమైనవి అన్నారు. కష్టపడి పనిచేసే సోదరీమణులు, జార్ఖండ్ బిడ్డలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటు దేశ ఆర్థికాభివృద్ధికి గణనీయమైన కృషి చేయగలరన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ‘మీ ప్రతిభను గుర్తించి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి’ అని మహిళలకు సూచించారు. మహిళా శక్తి జార్ఖండ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు శక్తిని అందిస్తుందన్నారు.


Next Story