Operation Sindoor: ప్రపంచానికి భారత్ కొత్త సందేశం

by S Gopi |
Operation Sindoor: ప్రపంచానికి భారత్ కొత్త సందేశం
X

దిశ, నేషనల్ బ్యూరో: మూడు రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తతల తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాలు శనివారం సాయంత్రం నుంచి కాల్పుల విరమణను ప్రకటించాయి. ఇంతటితో వివాదం ముగిసింది. అమెరికా మధ్యవర్తిత్వం వహించిన ఈ కాల్పుల విరమణ, పాకిస్తాన్‌పై చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'ను భారత్ ముగించింది. అయితే, యుద్ధం తీవ్రస్థాయికి చేరుతుందనే ఊహాగానాలు, పాక్‌కు పూర్తిస్థాయిలో బుద్ధి చెప్పకుండా భారత్ కాల్పుల విరమణకు ఎలా ఒప్పుకుందనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. అయితే, భారత ప్రభుత్వం ఈ కాల్పుల విరమణకు అంత ఆషామాషీగా ఒప్పుకుందా అంటే.. లేదని చెప్పాలి. ఎందుకంటే, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు, భారత్‌పై ఎలాంటి ఉగ్రవాదం చెలరేగకుండా గట్టి వార్నింగ్‌తో దీనికి ఒప్పుకున్నట్టు చూడాలి. భవిష్యత్తులో ఉగ్రవాదులు, వారిని ప్రోత్సహించే పాక్ లాంటి దేశాలు భారత్‌కు వ్యతిరేకంగా చేసే పనులకు యుద్ధ చర్యలు తప్పవని హెచ్చరించింది.

శనివారం ఉదయం భారత ప్రభుత్వం దేశ ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని భవిష్యత్తులో చేసే ఏదైనా ఉగ్రవాద చర్యను యుద్ధ చర్యగా పరిగణిస్తామని ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి భద్రతా సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయంతో, భారత వైఖరి 'ఇజ్రాయెల్ తరహా' లాంటి మార్పును సూచించింది. ఇజ్రాయెల్, అమెరికా లాంటి దేశాలు తమపై ఎలాంటి ఉగ్రవాద బెదిరింపులు లేదా చర్యలు ఎదురైనా తక్షణ యుద్ధ చర్యలకు దిగుతాయి. ప్రస్తుతం భారత్ తీసుకున్న నిర్ణయం కూడా అలాంటిదే.

ఉగ్రవాదులకు ఆతిథ్యం

ఇప్పటివరకు భారత్ ఉగ్రవాద చర్యలను జాగ్రత్తగా, చర్చలు, సంయమనంతో చేపట్టింది. గతంలో, ఉగ్రవాదుల దాడులను ప్రధానంగా అంతర్గత శాంతిభద్రతల సమస్యగా భావించింది. అందుకు తగినట్టుగా దర్యాప్తు సంస్థల ద్వారా దాన్ని పరిష్కరించుకుంది.

దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులు, ప్రధానంగా పాకిస్తాన్ హస్తం ఉన్న సందర్భాల్లో వారిని పట్టుకునేందుకు భారత ప్రభుత్వం పాక్ సహకారాన్ని కోరుతూ, ఆధారాలు, పత్రాలతో కేసు వేసేది. అయితే, దౌత్య విధానంలో భారత్‌కు న్యాయం లభించేది కాదు. దాదాపు ప్రతి సందర్భంలోనూ ఇదే జరిగింది. అరుదైన కేసుల్లో ఉగ్రవాదుల నేరాలను నిరూపించినప్పటికీ పాకిస్తాన్ ఆ దోషులను భారత్‌కు అప్పగించకుండా జాప్యం చేసేది. ఆ దేశ కోర్టులో వారిని విచారించే నెపంతో, అక్కడి ప్రభుత్వం వారికి ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలతో కూడిన భద్రత కల్పించేది.

ఈ సహకారం లేకపోవడం, ద్వంద్వ వైఖరికి రెండు స్పష్టమైన ఉదాహరణలు జైష్-ఎ-మొహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్, హఫీజ్ సయీద్. 2000 నుంచి భారత్‌లో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడులలో వారి హస్తం ఉన్నప్పటికీ, వారికి పాకిస్తాన్‌లో సురక్షితమైన భద్రత కల్పించారు. లష్కరే తోయిబా హెడ్ సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి శిక్ష విధించినప్పుడు కూడా, అతన్ని ఐఎస్ఐ గౌరవనీయ అతిథిగా పాకిస్తాన్ ప్రభుత్వం ఆతిథ్యం ఇచ్చింది.

ఈ విధానం ఇకమీదట చెల్లదు.

ఉగ్రవాదం అంటే యుద్ధమే

ప్రభుత్వం ఉగ్రవాదాన్ని యుద్ధ చర్యగా పరిగణించాలని నిర్ణయించడంతో, దౌత్యం ద్వారా పొందే సుదీర్ఘమైన న్యాయానికి తలుపులు మూసేసినట్టే. ఉగ్రవాదులు, వారి ప్రధాన స్థావరాలు, వారికి అండగా నిలిచేవారు, ఆర్థిక సహాయం అందించేవారిపై ఖచ్చితమైన దాడులతో పాటు పూర్తి బలంతో భారత్ ఉగ్రవాదంపై ప్రతీకారం తీర్చుకుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే పాకిస్తాన్, లేదా మరే ఉగ్రవాదమైనా భారత్‌తో పెట్టుకుంటే 'ఆపరేషన్ సిందూర్' తరహా ప్రతీకారం ఇకమీదట అమలవుతుంది.

పోలీసులు, ప్రత్యేక సంస్థల దర్యాప్తు ద్వారా నేరాన్ని నిరూపించి మాత్రమే ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే పద్ధతిని కాదని భారత్ తాజా నిర్ణయం కొత్త మార్గాలను తెరిచింది. గతంలో ఉగ్రవాదులు, వారి మద్దతుదారులతో వ్యవహరించడానికి సహనం, దౌత్య విధానం వంటి 'సాఫ్ట్ స్టేట్' ముద్రను భారత్ చెరిపేసింది. ఇజ్రాయెల్, అమెరికా దేశాల విధానం తరహాలో గట్టిగా, మరింత ఉత్సాహంతో ప్రతీకారం తీర్చుకునేలా భారత్ చర్యలు ఉండనున్నాయి. ఈ తరహా నిర్ణయంతో పాక్‌తో పాటు ప్రపంచానికే భారత్ కొత్త సందేశం ఇచ్చిందనుకోవచ్చు. సాధారణంగా ఇజ్రాయెల్, అమెరికా లాంటి దేశాలు తరచుగా ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వస్తే ముందుగా దాడికి దిగుతాయి. ఏదైనా ఉగ్రవాద దాడి జరిగితే, ఆయా దేశాలు ఖచ్చితమైన దాడులు, లక్ష్యం ద్వారా ఎవరినైనా హత్య చేస్తాయి. పూర్తి స్థాయి యుద్ధానికి కూడా దిగుతాయి. 2002లో ఇరాక్‌పై అమెరికా దాడి, ఇప్పుడు కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఈ విధానానికి ప్రధాన ఉదాహరణలు.

పాక్‌కు గట్టి సందేశం

గత ఐదు దశాబ్దాలుగా, పాకిస్తాన్ అణ్వాయుధ గొడుగు కింద ఉగ్రవాదులను పెంచే విధానాన్ని అనుసరిస్తోంది. ఇన్నాళ్లు భారత్ అనుసరించిన ఉదారవాదానికి, సాక్ష్యాలతో ఉగ్రవాదులపై చర్యలకు దౌత్య పద్దతిని కోరుకున్నప్పుడు పాకిస్తాన్ సిగ్గులేకుండా ఏమీ తెలియనట్టు ప్రవర్తించింది. భారత గడ్డపై ఉగ్రవాదానికి రహస్యంగా, బహిరంగంగా మద్దతు ఇవ్వడం ద్వారా భారత సహనాన్ని పరీక్షించింది. ఇకపై, అలాంటి అబద్దాలకు తావు ఉండదు. పాకిస్తాన్ గానీ, అది పోషించే ఉగ్రవాదులు గానీ భారత్ విషయంలో బెదిరింపులో, ఇంకేదైనా ప్రకటనలో దిగితే భారత్ నుంచి యుద్ధమే అనేది స్పష్టం.



Next Story

Most Viewed