విపత్తులు ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి: ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు

by Dishanational2 |
విపత్తులు ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి: ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రకృతి వైపరీత్యాలు తరచుగా సంభవించి మానవులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఇంటర్నేషనల్ కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఐసీడీఆర్ఐ) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో మోడీ వర్చువల్‌గా ప్రసంగించారు. విపత్తులు తీవ్రంగా మారాయని, వాటి వల్ల ఎంతో నష్టం వాటిల్లుందని తెలిపారు. అనేక ఇండ్లు ధ్వంసమవడంతో పాటు వేలాది మంది నిరాశ్రయులవుతున్నారని చెప్పారు. కాబట్టి విపత్తులను తట్టుకునే సదుపాయాలపై ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలని సూచించారు.

ప్రకృతి, విపత్తులను సరిహద్దులు లేవని, ఎప్పుడు ఏ ప్రాంతంలో సంభవిస్తాయో ఊహించలేమని తెలిపారు. విపత్తు తర్వాత తక్షణ దృష్టి సహజంగానే ఉపశమనం, పునరావాసంపై ఉంటుందని, కానీ దీంతో పాటు మౌలిక సదుపాయాలపై కూడా దృష్టి పెట్టాలన్నారు. దేశాలు వ్యక్తిగతంగా దృఢంగా ఉన్నప్పుడు ప్రపంచం కూడా సమిష్టిగా మనుగడ సాధించగలుగుతుందని నొక్కి చెప్పారు. చిన్న ద్వీప దేశాలకు మద్దతివ్వాలని స్పష్టం చేశారు. ఐసీడీఆర్ఐ ప్రారంభించినప్పటి నుంచి భారత్ ఒకే వైఖరిని కలిగి ఉందని తెలిపారు.

కాగా, ఐసీడీఆర్ఐ అనేది దేశాలు, ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు, పలు ప్రయివేటు రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ కూటమి. ఇది విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఉంది. దీనిని 2019లో న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోడీ ప్రారంభించారు. ప్రస్తుతం 39 దేశాలు, 7 సంస్థలు ఐసీడీఆర్ఐలో సభ్యత్వం కలిగి ఉన్నాయి. పలు దేశాల సభ్యత్వ ఆమోదం పెండింగ్‌లో ఉంది.



Next Story

Most Viewed