- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Balochistan: ఓవైపు భారత్ తో ఉద్రిక్తతలు.. మరోవైపు తిరుగుబాటుదారులు

దిశ, నేషనల్ బ్యూరో: ఓవైపు భారత్ తో ఉద్రిక్తతలు.. మరోవైపు బలూచ్ తిరుగుబాటుదారులతో పాక్ ఉక్కిరిబిక్కరవుతోంది. దశాబ్దాలుగా ఆ దేశానికి ముప్పుగా మారిన బలూచిస్థాన్ (Balochistan) వేర్పాటువాద ఉద్యమం ఇప్పుడు మరింత తీవ్రమైంది. పాక్ లోని ఓ పట్టణాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకోవడంతో దాయాదికి (Pakistan) స్వదేశంలోనే సవాల్ ఎదురైంది. బలోచిస్థాన్ ప్రావిన్స్లోని కాలత్ జిల్లా మంగోచర్ పట్టణాన్ని తాము స్వాధీనం చేసుకున్నట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) శనివారం ప్రకటించింది. అంతేగాక, బలూచిస్థాన్ వ్యాప్తంగా 39 ప్రాంతాల్లో మెరుపు దాడులు చేశామని వెల్లడించింది. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, మిలిటరీ కాన్వాయ్లపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇప్పటికే కొంతమంది స్థానిక పోలీసులను బందీలుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసు స్టేషన్ను తమ నియంత్రణలోకి తీసుకున్న బీఎల్ఏ.. రహదారులను దిగ్బంధించింది.
స్పందించని పాక్ ప్రభుత్వం
అయితే, ఈ పరిణామాలపై పాక్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. శుక్రవారం కూడా పాక్ ఆర్మీ సిబ్బందిపై బలూచ్ రెబల్స్ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ దాడిలో 22 మంది పాక్ సైనికులు చనిపోయినట్లు వార్తలొచ్చాయి. అయితే, దీనిపైనా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. బలూచ్ ప్రావిన్సులో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు సహా సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. వీటి ఆదాయం వల్లే పాక్ ఖజానా నిండుతోంది. కానీ, అక్కడ పేదరికం తీవ్రంగా ఉంది. జనాభా తక్కువగా ఉండటంతో అభివృద్ధి జరగట్లేదు. దీంతో, అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొంది. వేర్పాటువాదులు శక్తిమంతంగా మారారు. ప్రత్యేక దేశంగా ఏర్పడాలని కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నారు.