పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్: తదుపరి విచారణ ఏప్రిల్ 13న

by Disha Web Desk 1 |
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్: తదుపరి విచారణ ఏప్రిల్ 13న
X

దిశ, వెబ్ డెస్క్: పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్‌ సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. పరువు నష్టం కేసులో శిక్షపై ఆయన చేసిన అప్పీల్‌ను కోర్టు ఏప్రిల్ 13న విచారించనుంది. 'దొంగలు' అదే ఇంటి పేరును ఎలా ఎంచుకున్నారని వ్యాఖ్యానిస్తూ.. పారిపోయిన ఇద్దరు వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ ఇంటి పేరును ముడిపెట్టి ప్రసంగించినందుకు రాహుల్ గాంధీని దిగువ కోర్టు దోషిగా నిర్ధారించింది. అదేవిధంగా గత నెలలో రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది.

సదరు తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు కోర్టు అతనికి 30 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే రాహుల్ లోక్‌సభ సభ్యుడిగా అనర్హుడయ్యాడు. దిగువ కోర్టు తీర్పుపై అప్పీల్ చేసేందుకు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ప్రత్యేక విమానంలో ఈ రోజు సూరత్ చేరుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని దోషిగా నిర్ధారించిన కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను నిలిపివేయాలని కోరారు.

అయితే, సెషన్స్ కోర్టు దోషిపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రతివాది వాదన వినకుండానే ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని కోర్టు పేర్కొంది. ఏప్రిల్ 10లోగా స్పందించాలని ఈ కేసులో ఫిర్యాదు దారుడికి నోటీసులు జారీ చేసింది. రాహుల్ కు బెయిల్ మంజూరు చేసిన సెషన్స్ కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 13కి వాయిదా వేసింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed