ఈశాన్య రాష్ట్రాలైన మూడు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి..

by Disha Web Desk 13 |
ఈశాన్య రాష్ట్రాలైన మూడు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి..
X

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఉదయం 8గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుందని తెలిపింది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున నియోజకవర్గాలుండగా, ప్రభుత్వ ఏర్పాటుకు 31 సీట్లలో గెలవాల్సి ఉంటుంది. దీంతో విజయం తమదేనని అన్ని పార్టీలూ ధీమాతో ఉన్నాయి. 30 ఏళ్లపాటు త్రిపురను పాలించిన సీపీఎం.. 2018లో బీజేపీ చేతిలో ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది.

దీంతో రాష్ట్రంలో పునర్వైభవం పొందుతామని సీపీఎం భావిస్తుండగా, ఈసారి విజయం తమదేనని కాంగ్రెస్, రెండోసారి కూడా అధికారం ఖాయమని బీజేపీ ధీమాతో ఉన్నాయి. ఇక, మేఘాలయలో మరోసారి తామే గెలుస్తామని సీఎం, ఎన్పీపీ అధినేత కన్రాడ్ సంగ్మా భావిస్తున్నారు. ఒకవేళ హంగ్ వచ్చినా ఎక్కువ సీట్లు తమకే వస్తాయి కాబట్టి, ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని సీఎం కావచ్చని విశ్వసిస్తున్నారు.

2018 ఎన్నికల్లో నాగాలాండ్‌లో కూటమిగా బరిలోకి దిగిన బీజేపీ, ఎన్డీపీపీలు.. ఈసారీ అలాగే పోటీ చేశాయి. దీంతో మళ్లీ తమదే విజయమని పూర్తి నమ్మకంతో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ సైతం ఇదే అంచనా వేశాయి. త్రిపురలో బీజేపీ, మేఘాలయలో హంగ్, నాగాలాండ్ బీజేపీ, ఎన్డీపీపీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కాగా, త్రిపురకు గత నెల 27న, మిగతా రెండు రాష్ట్రాలకు 16న ఎన్నికలు జరిగాయి. మరోవైపు, ఈ మూడు రాష్ట్రాలతోపాటు 6 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలూ గురువారమే తేలనున్నాయి. వీటిలో కేంద్ర పాలిత ప్రాంతం లక్ష్వదీప్‌లోని ఒక ఎంపీ స్థానం ఉండగా, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడు, బెంగాల్, మహారాష్ట్ర(2)లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.



Next Story