అసోంలో బహుభార్యత్వంపై నిషేధం..! ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 13 |
అసోంలో బహుభార్యత్వంపై నిషేధం..! ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు
X

గౌహతి: రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని నిషేధించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. న్యాయపరమైన అంశాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) వైపు బీజేపీ పాలిత రాష్ట్రం అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. బహుభార్యత్వాన్ని నిషేధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా అనే దానిపై నిపుణుల కమిటీ దర్యాప్తు చేస్తుంది.

‘రాష్ట్రంలో బహు భార్యత్వాన్ని నిషేధించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉందో లేదో పరిశీలించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని అసోం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25తో పాటు ముస్లిం పర్సనల్ లా (షరియత్ చట్టం) 1937లోని నిబంధనలను కూడా పరిశీలిస్తుంది. న్యాయ నిపుణులతో పాటు అన్ని వర్గాల వారితో చర్చించిన తర్వాత ఈ కమిటీ ఒక నిర్ణయానికి వస్తుంది’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ముస్లింలలో బహు భార్యత్వం, నిఖా హలాలా ఆచారం రాజ్యాంగంలో చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీం కోర్టు చెప్పిన కొన్ని నెలల తర్వాత అసోం ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది.

Next Story

Most Viewed