బిల్కిస్ బానో‌కు గుజరాత్ సర్కారు, కేంద్ర సర్కారు క్షమాపణ చెప్పాలి : ఒవైసీ

by Dishanational4 |
బిల్కిస్ బానో‌కు గుజరాత్ సర్కారు, కేంద్ర సర్కారు క్షమాపణ చెప్పాలి : ఒవైసీ
X

దిశ, నేషనల్ బ్యూరో : బిల్కిస్ బానో రేపిస్టులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని తప్పుపడుతూ సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పుపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.రేపిస్టులకు బీజేపీ ప్రభుత్వం సహాయం చేయడం దారుణమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు. రేపిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు కనబర్చాల్సిన వైఖరికి ఈ తీర్పు ఒక కొలమానంగా నిలుస్తుందని ఒవైసీ ఆశాభావం వ్యక్తం చేశారు. నారీ శక్తి గురించి ప్రసంగాల్లో ఊదరగొట్టే ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నడుపుతున్న ప్రభుత్వమే గుజరాత్‌లో ఈ అడ్డదిడ్డమైన నిర్ణయాన్ని తీసుకొని, రేపిస్టులకు అండగా నిలబడిందని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. నారీ శక్తి పేరుతో బూటకపు వాదనలను ప్రధాని వినిపిస్తున్నారనేందుకు ఇదే నిదర్శనమన్నారు. గుజరాత్‌ రాష్ట్ర సర్కారు, కేంద్ర సర్కారు కలిసి 2022 సంవత్సరంలో బిల్కిస్ బానో కేసులోని రేపిస్టుల విడుదలకు మార్గం సుగమం చేశాయని పేర్కొన్నారు. వీరంతా బిల్కిస్ బానోకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed