34 మంది సుప్రీం జడ్జీలు, 25 మంది హైకోర్టు సీజేలు ఒకే వేదికపైకి

by Dishanational4 |
34 మంది సుప్రీం జడ్జీలు, 25 మంది హైకోర్టు సీజేలు ఒకే వేదికపైకి
X

దిశ, నేషనల్ బ్యూరో : 1950 జనవరి 28న చారిత్రక ప్రస్థానాన్ని ప్రారంభించిన భారతదేశ సర్వోన్నత న్యాయస్థానానికి ఆదివారంతో 75 ఏళ్లు నిండుతాయి. ఈ విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకొని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ప్రత్యేక ధర్మాసనం భేటీ కానుంది. అయితే ఈ బెంచ్ విచారణ జరిపేందుకో.. కేసులపై చర్చించేందుకో సమావేశం కావడం లేదు. 75 వసంతాల సుప్రీంకోర్టు మజిలీకి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచేందుకే ఈ ధర్మాసనం భేటీ అవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరయ్యే ఈ ప్రత్యేక ప్రోగ్రాంలో సుప్రీంకోర్టులోని మొత్తం 34 మంది న్యాయమూర్తులూ పాల్గొననున్నారు. 1950లో సుప్రీంకోర్టు ఏర్పాటైన టైంలో జరిగిన వేడుకలోనూ దేశంలోని మొత్తం 25 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈసారి కూడా వారంతా హాజరవుతారు. అంటే దేశంలోని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, సీజేఐ సహా సుప్రీంకోర్టులోని మొత్తం 34 మంది జడ్జీలు ఒకే చోట ఫొటో సెషన్‌లో పాల్గొననున్నారు. ప్రధాని మోడీ కూడా వారితో కలిసి ఫొటోలు దిగుతారు. ఈసందర్భంగా సుప్రీంకోర్టు ప్రస్థానంపై ప్రసంగాలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆదివారం రోజు అరగంట పాటు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ ప్రోగ్రాం వేదికగా సుప్రీంకోర్టు కొత్త వెబ్‌సైట్‌ను కూడా సీజేఐ ప్రారంభించనున్నారు.


Next Story