అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగమే: చైనా వ్యాఖ్యలపై అమెరికా స్పందన

by Dishanational2 |
అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగమే: చైనా వ్యాఖ్యలపై అమెరికా స్పందన
X

దిశ, నేషనల్ బ్యూరో: అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేనని ఇటీవల చైనా చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్‌ను భారత భూభాగంగా యూఎస్ గుర్తిస్తుందని తెలిపింది. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి చైనా చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు యూఎస్ స్టేట్‌డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ వేదాంత్ పటేల్ మీడియాతో మాట్లాడారు. ‘అరుణాచల్ ప్రదేశ్‌ను భారత భూభాగంగా అమెరికా గుర్తిస్తోంది. ఈ ప్రాంతంలో చొరబాట్లు, ఆక్రమణలు, సైనిక చర్యలను ముందుకు తీసుకెళ్లే ఏకపక్ష నిర్ణయాలకు యూఎస్ వ్యతిరేకం. ఇటువంటి ప్రయత్నాలను మానుకోవాలి’ అని వ్యాఖ్యానించారు.

ఈ నెల9న ప్రధాని మోడీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటన అనంతరం చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా రక్షణశాఖ ప్రతినిధి కల్నల్ జాంగ్ జియోగాంగ్ మాట్లాడుతూ..అరుణాచల్ ప్రదేశ్ చైనా భూభాగమేనని తెలిపారు. చట్టవ్యతిరేకంగా భారత్ ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తాము ఎప్పటికీ ఒప్పుకోమని స్పష్టం చేశారు. కాగా, అరుణాచల్ ప్రదేశ్ కు చైనా జిజాంగ్ అనే పేరు కూడా పెట్టింది. ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ సైతం స్పందించింది. చైనా అసంబద్ధ వ్యాఖ్యలు చేయొద్దని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనే అమెరికా స్పందించడం గమనార్హం.

కాగా, అరుణాచల్ ప్రదేశ్‌లో భారత నేతల పర్యటనలపై చైనా నిరంతరం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అంతేగాక గతేడాది అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాల పేర్లను మార్చింది. గత ఐదేళ్లలో చైనా ఈ చర్యలకు పాల్పడటం ఇది మూడోసారి. అంతకుముందు 2015, 2021లోనూ పలు ప్రదేశాల పేర్లను మార్చింది. దీనిని ఎప్పటికప్పుడు భారత్ ఖండిస్తూనే ఉంది. అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగమేనని గతంలోనూ అమెరికా పలుమార్లు నొక్కి చెప్పింది.


Next Story