ఢిల్లీలో హై టెన్షన్.. నిఘా నీడలో జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలు!

by Malleboina Mahesh |

జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన పిలుపు. సభకు పోలీసుల అనుమతి నిరాకరణ. అమెరికా నుంచి వస్తున్న పార్టీ లీడర్ అభిజిత్ దీప్కే అరెస్టుకు అవకాశం.

ఢిల్లీలో హై టెన్షన్.. నిఘా నీడలో జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలు!
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో హై టెన్షన్ (High tension) వాతావరణం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన నీట్ (NEET), సీబీఎస్‌ఈ (CBSE) పరీక్షల లీకేజీల వ్యవహారంపై 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) తీవ్ర నిరసనకు పిలుపునిచ్చింది. ఈ పరీక్షల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ప్రసిద్ధ నిరసన వేదిక జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించేందుకు కాక్రోచ్ పార్టీ సన్నద్ధమైంది. కాక్రోచ్ జనతా పార్టీ నిరసన పిలుపుతో కేంద్ర ప్రభుత్వం (Central Govt) అప్రమత్తమైంది. జంతర్ మంతర్ వద్ద ఈ సభ జరిగితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం కాక్రోచ్ పార్టీ (సీజేపీ) ప్రతిపాదిత సభకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు.

అయినప్పటికీ నిరసనకారులు తరలివచ్చే అవకాశం ఉండటంతో జంతర్ మంతర్, దాని పరిసర ప్రాంతాలను పోలీసులు తమ పూర్తి నిఘా నీడలోకి తీసుకువచ్చారు. అక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు, ఈ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మరికాసేపట్లో అమెరికా నుండి నేరుగా ఢిల్లీకి చేరుకోనున్నారు. ఆయన ఢిల్లీలో అడుగుపెడితే నిరసన మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందన్న అనుమానంతో, విమానాశ్రయం (ఎయిర్‌పోర్టు) లోనే అభిజిత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, నిరుద్యోగ యువత సమస్యలపై సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చిన ఈ కాక్రోచ్ పార్టీ నిరసనకు పలువురు దేశీయ రాజకీయ ప్రముఖులు కూడా తమ మద్దతును ప్రకటించడం గమనార్హం.

Next Story