పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-14 16:35:52  IST  )

కేంద్ర ప్రభుత్వం(Central Govt) ఇచ్చే అత్యున్నత పురస్కారాలైన పద్మ పురస్కారాలకు(Padma Awards) అర్హులైన వారి నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానింంచింది.

పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం(Central Govt) ఇచ్చే అత్యున్నత పురస్కారాలైన పద్మ పురస్కారాలకు(Padma Awards) అర్హులైన వారి నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానింంచింది. పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డులను 1954 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పురస్కారాలను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజినీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, వాణిజ్యం, పరిశ్రమలు మొదలైన రంగాలలో విశిష్ట సేవలు అందించి విజయాలు సాధించిన వారికి ఈ అవార్డులు ఇస్తారు.

2026 సంవత్సరానికి ఇచ్చే ఈ పద్మ అవార్డుల కోసం నామినేషన్లు/సిఫార్సులను రాష్ట్రపతి పురస్కార్ పోర్టల్ https://awards.gov.in ద్వారా స్వీకరిస్తారు. నామినేషన్లను వచ్చే నెల 31 లోగా పైన పేర్కొన్న పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఫార్మాట్‌లో, గరిష్టంగా 800 పదాలకు మించకుండా వివరణాత్మక కథనం రూపంలో పంపించాల్సి ఉంటుంది. అవార్డుకు ప్రతిపాదిస్తున్న వ్యక్తి యొక్క విశిష్టమైన, అత్యుత్తమ సేవ/కృషిని స్పష్టంగా తెలియజేయాలి, ఆన్‌లైన్లో నామినేషన్లు పంపడానికి అవసరమైన సూచనలు https://awards.gov.in పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి.

అలాగే నియమ నిబంధనలు పద్మ అవార్డుల వెబ్‌సైట్ https://padmaawards.gov.in లో అందుబాటులో ఉన్నాయి. నామినేషన్ల ఖరారు సమయంలో ప్రతిపాదిత వ్యక్తులు జీవితకాలం పాటు చేసిన కృషికి అత్యంత ప్రశంసనీయులని నిర్ధారించే అంశాలు, సమాజానికి వారి సేవ, సాధనలలోని గొప్పతనం పరిగణనలోకి తీసుకుంటారు. పద్మ అవార్డు దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయినందున రాష్ట్ర లేదా జాతీయ స్థాయిలో లేదా వారి సంబంధిత రంగంలో ఇప్పటికే ఏదైనా అవార్డు పొందిన వ్యక్తిని కూడా పరిగణనలోకి తీసుకోవడంజరుగుతుంది. డాక్టర్లు, శాస్త్రవేత్తలు మినహా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసేవారు పద్మ అవార్డులకు అర్హులుకారు.

Next Story