సుప్రీంకోర్టులో జగన్‌ సర్కార్‌కు చుక్కెదురు

by Dishafeatures2 |
సుప్రీంకోర్టులో జగన్‌ సర్కార్‌కు చుక్కెదురు
X

దిశ, డైనమిక్ బ్యూరో : సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. అమరావతిపై హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అమరావతిపై హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది. అమరావతి రాజధాని విషయంలో హైకోర్టు వెల్లడించిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అదే సమయంలో హైకోర్టు తీర్పును యధావిధిగా అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని రైతులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లను విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్నల ధర్మాసనం కేసును విచారిస్తోంది.

ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైనప్పటి నుంచి హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు పదే పదే కోరారు. దీంతో ఏపీ ప్రభుత్వ న్యాయవాదులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఒక కేసు విచారణ పూర్తి కాకుండా మరో కేసు విచారించడం తగదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అలా సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేశారు.

న్యాయమూర్తి అసహనం

మరోవైపు మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకున్న తరువాత ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అర్ధం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ వాదించారు. అయితే ఏపీ ప్రభుత్వ లాయర్లు చేసిన విజ్ణప్తులను న్యాయమూర్తి జస్టిస్ కె ఎం జోసెఫ్ పట్టించుకోలేదు. ఇరు వాదనలు విన్న ధర్మాసనం కేసు విచారణను జూలై 11కు వాయిదా వేసింది. జూలై 11న తొలికేసుగా విచారణకు తీసుకుంటామని ధర్మాసనం వెల్లడించింది. ఇదిలా ఉంటే జూన్ 16న ఈ కేసు విచారిస్తు్న్న జస్టిస్ కె ఎం జోసెఫ్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే జూలై 11న వేరే ధర్మాసనం ముందు అమరావతి కేసు విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

తాను రిటైర్ అవుతున్నందున అమరావతిపై సుదీర్ఘ వాదనలు విని జడ్జిమెంట్ రాసేందుకు సమయం లేదని న్యాయమూర్తి కె ఎం జోసెఫ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇదే సందర్భంలో పిటిషన్ దాఖలు చేసిన వారిలో కొంతమంది రైతులు చనిపోయారని కోర్టు దృష్టికి రైతుల తరపు న్యాయవాదులు తీసుకువచ్చారు. అయితే మరణించిన వారి తరపున ప్రతినిధులు ప్రతివాదులుగా ఉండేందుకు అనుమతి కోరారు. అందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతించింది. వారికి నోటీసులు పంపాలని ప్రభుత్వ న్యాయవాదులను ధర్మాసనం ఆదేశించింది.



Next Story

Most Viewed