ఆ మీటింగ్ మోడీకి ముఖ్యం కాదేమో : కాంగ్రెస్

by Disha Web Desk 13 |
ఆ మీటింగ్ మోడీకి ముఖ్యం కాదేమో : కాంగ్రెస్
X

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో లేని సమయంలో మణిపూర్‌ పరిస్థితిపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తుండటం.. ఆ మీటింగ్ ప్రధానికి అంత ముఖ్యం కాదనే సంకేతాన్ని దేశ ప్రజల్లోకి పంపుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. "మణిపూర్‌ 50 రోజుల నుంచి తగలబడుతున్నా ప్రధాని మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ప్రధాని దేశంలో లేని సమయంలో (జూన్ 24న) అఖిలపక్ష సమావేశం పెట్టారు. ప్రధానికి ఈ సమావేశం ముఖ్యం కాదని స్పష్టంగా తెలిసిపోతోంది" అని ఆయన ట్వీట్ చేశారు.

"మణిపూర్ హింసపై కేంద్రం స్పందించాలని యావత్ దేశం కోరుతోంది. ప్రధానమంత్రే మణిపూర్‌కు వచ్చి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉండాల్సింది" అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. "మణిపూర్‌లో శాంతి కోసం ఏ ప్రయత్నమైనా ఆ రాష్ట్రంలోనే జరగాలి. అక్కడ పోరాడుతున్న వర్గాలను చర్చల వేదికపైకి తీసుకొస్తేనే రాజకీయ పరిష్కారం లభిస్తుంది. ఈ చర్చలను ఢిల్లీలో నిర్వహిస్తే సీరియస్‌నెస్ లోపిస్తుంది’’ అని ట్విట్టర్‌ వేదికగా వేణుగోపాల్ సూచించారు. మణిపూర్‌లో 50 రోజుల హింస, వందలాది మరణాల తర్వాత చాలా ఆలస్యంగా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు.

Next Story

Most Viewed