కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య: ఈ ఏడాదిలో నాలుగో ఘటన

by Dishanational2 |
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య: ఈ ఏడాదిలో నాలుగో ఘటన
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్‌లోని కోటా సిటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జార్ఖండ్‌కు చెందిన శుభమన్ చౌదరి మంగళవారం ఉదయం తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని సూసైడ్‌కు పాల్పడ్డాడు. ఈ ఏడాదిలో ఇది నాలుగో ఘటన కావడం గమనార్హం. జార్ఖండ్‌కు చెందిన శుభ్‌మన్ చౌదరి గత రెండేళ్లుగా కోటాలోనే ఉంటూ జేఈఈ మెయిన్స్‌కు సిద్ధమవుతున్నాడు. అయితే సోమవారం వెలువడిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయి. దీంతో మనస్తాపానికి గురైన శుభ్‌మన్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువకుడి కుటుంబీకులకు సమాచారం అందించారు. కోటాలో ఇలాంటి ఘటనలకు చెక్‌ పెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరో విద్యార్థి సైతం ఆదివారం నుంచి కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. కాగా, గతేడాది కోటాలో 26 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు.

ఒత్తిడే కారణమా?

కోటాలో ప్రదానంగా ఐఐటీ, నీట్, జేఈఈ పరీక్షలకు కోచింగ్ ఇస్తుంటారు. ఈ ఎగ్జామ్స్‌కు ఇది ఒక హబ్‌గా మారింది. అనేక రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ ప్రిపేర్ అవుతుంటారు. అయితే కోచింగ్ టైంలో ఎక్కువ సేపు క్లాసులు వినడం, ఈ పరీక్షలను సీరియస్‌గా తీసుకోవడంతో కొంత ఒత్తిడికి గురవుతుంటారు. పరీక్షలకు ముందు ఈ పరిస్థితి ఉండగా.. రిజల్ట్ అనంతరం అనుకున్న మార్కులు రాకపోతే పేరెంట్స్ నుంచి ఒత్తిడి ఎదుర్కుంటుంటారు. అంతేగాక ఈ పరీక్షలకు తక్కువ సీట్లకు ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. దీంతో తక్కువ మార్కులు వస్తే సీట్ వచ్చే అవకాశం ఉండదు. ఈ క్రమంలోనే విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి గురవుతుంటారని తెలుస్తోంది. విద్యార్థులు ఒత్తిడిని జయించేందుకు అధికారులు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌కు పలు మార్గదర్శకాలు జారీచేసినప్పటికీ సత్పలితాలు ఇవ్వడం లేదు.

Next Story

Most Viewed