లిక్కర్ స్కామ్ కేసులో ఆప్‌కు మరో షాక్ : మంత్రి కైలాష్ గెహ్లాట్‌కు ఈడీ సమన్లు!

by Dishanational2 |
లిక్కర్ స్కామ్ కేసులో ఆప్‌కు మరో షాక్ : మంత్రి కైలాష్ గెహ్లాట్‌కు ఈడీ సమన్లు!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఈ కేసులో సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, ఆప్ నేత సంజయ్ సింగ్‌, సత్యేందర్ జైన్‌లు అరెస్టు కాగా..తాజాగా ఇదే కేసులో మరో మంత్రి కైలాష్ గెహ్లాట్‌కు సైతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ కేసులో విచారణలో భాగంగా తమ ఎదుట హాజరు కావాలని, మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఈడీ గెహ్లాట్‌ను ఆదేశించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆయనకు ఈడీ సమన్లు జారీ చేయడం ఇదే తొలిసారి. నజాఫ్ గడ్ నుంచి ఆప్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కైలాష్ ఢిల్లీ ప్రభుత్వంలో రవాణా, హోం, న్యాయ శాఖ మంత్రిగా బాధ్యతల్లో ఉన్నారు.

కాగా, ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన 2021-22 మద్యం పాలసీ ముసాయిదాను సిద్ధం చేసిన ప్యానెల్‌లో కైలాష్ కూడా ఉన్నారు. మద్యం పాలసీని తయారు చేస్తున్న సమయంలో గెహ్లాట్ తన అధికారిక నివాసాన్ని ఉపయోగించుకునేందుకు అప్పటి ఆప్ కమ్యూనికేషన్ ఇన్‌చార్జ్ విజయ్ నాయర్‌కు అనుమతిచ్చారని ఈడీ గతంలో పేర్కొంది. తన మొబైల్ నంబర్లను సైతం ఆయన పదే పదే మార్చారని ఆరోపించింది. ఈ నెల 21న అరెస్టైన కేజ్రీవాల్‌కు ఏప్రిల్ 1వరకు కస్టడీ విధించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్టైన కొద్ది రోజులకే ఈడీ కైలాష్‌కు సమన్లు జారీ చేయడం గమనార్హం.


Next Story

Most Viewed