కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్: బీజేపీలో చేరిన అర్చనా పాటిల్

by Dishanational2 |
కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్: బీజేపీలో చేరిన అర్చనా పాటిల్
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో మరో భారీ షాక్ తగలింది. సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కోడలు అర్చనా పాటిల్ చకుర్కర్ శనివారం బీజేపీలో చేరారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అర్చన పాటిల్ ఉద్గీర్‌లోని లైఫ్‌కేర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ చైర్‌పర్సన్‌ కాగా.. ఆమె భర్త శైలేష్ పాటిల్ చందూర్కర్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పార్టీలో చేరిన అనంతరం అర్చనా మీడియాతో మాట్లాడారు. ‘రాజకీయ రంగంలో పనిచేయడానికి బీజేపీలో జాయిన్ అయ్యాను. ప్రధాని మోడీ తీసుకువచ్చిన నారీ శక్తి వందన్ అధినియం నన్ను ఎంతో ప్రభావితం చేసింది. ఇది మహిళలకు సమాన అవకాశాన్ని కల్పిస్తుంది’ అని తెలిపారు. అర్చన పాటిల్‌ను బీజేపీలోకి స్వాగతించిన ఫడ్నవీస్.. అర్చన చేరికతో పార్టీకి మరింత బలం చేకూరుతుందన్నారు. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం అశోక్ చవాన్ బీజేపీ గూటికి చేరగా..తాజాగా అర్చన బీజేపీలో చేరడంతో కాంగ్రెస్‌కు షాక్ తగిలినట్టు అయింది. అయితే ఎన్నికల ముందు ఈ పరిణామాలు జరగడం విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story

Most Viewed