పంజాబ్‌లో ఆప్ అభ్యర్థుల ప్రకటన..జాబితా ఇదే?

by Dishanational2 |
పంజాబ్‌లో ఆప్ అభ్యర్థుల ప్రకటన..జాబితా ఇదే?
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలకు గాను పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నలుగురు అభ్యర్థులను మంగళవారం ప్రకటించింది. ఫిరోజ్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి జగదీప్ సింగ్ కక బ్రార్, గురుదాస్ పూర్ సెగ్మెంట్ నుంచి అమన్‌షేర్ సింగ్ కల్సి, జలంధర్ నుంచి పవన్ కుమార్ తిను, లుథియానా నుంచి అశోక్ పరాశర్ పప్పీలను పోటీలో నిలిపింది. ఈ విషయాన్ని ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ వెల్లడించారు. ఈ నలుగురిలో ముగ్గురు ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ ప్రకటనతో పంజాబ్‌లోని మొత్తం 13 పార్లమెంట్ స్థానాలకు ఆప్ అభ్యర్థులను ప్రకటించింది. ఇండియా కూటమిలో భాగమైన ఆప్ పంజాబ్‌లో ఒంటరిగా బరిలోకి దిగుతోంది. రాష్ట్రంలో జూన్ 1న చివరి దశలో ఎన్నికలు జరగనున్నాయి.

స్టార్ క్యాంపెయినర్‌గా సునీతా కేజ్రీవాల్!

ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా మరికాసేపట్లో విడుదల కానుంది. అయితే కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ఆప్ స్టార్ క్యాంపెయినర్‌గా ఉంటారని తెలుస్తోంది. ఆమె గుజరాత్‌లో ఆప్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కేజ్రీవాల్ అరెస్టైనప్పటి నుంచి సునీత ఇండియా కూటమి నాయకులతో సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆప్ స్టార్ క్యాంపెయినర్‌గా సునీతా వ్యవహరిస్తారని సమాచారం. 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ సునీతా కేజ్రీవాల్ న్యూ ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్ కోసం ప్రచారం నిర్వహించారు. కాగా, ఢిల్లీలో 4, పంజాబ్‌లో 13, హర్యానాలో ఒకటి, గుజరాత్‌, అసోంలలో రెండు స్థానాల్లో ఆప్ పోటీ చేస్తోంది.


Next Story