ఉగ్రదాడి హెచ్చరికల వేళ.. జమ్మూ కశ్మీర్‌లో భారీ పేలుడు పదార్థం (ఐఈడీ) నిర్వీర్యం

by Ramesh Naini |

ఉగ్రదాడి జరుగుతుందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న భద్రతా బలగాలు జమ్మూ కశ్మీర్‌లో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి.

ఉగ్రదాడి హెచ్చరికల వేళ.. జమ్మూ కశ్మీర్‌లో భారీ పేలుడు పదార్థం (ఐఈడీ) నిర్వీర్యం
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఉగ్రదాడి జరుగుతుందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న భద్రతా బలగాలు జమ్మూ కశ్మీర్‌లో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి. గందర్‌బల్ జిల్లాలో రోడ్డు పక్కన అమర్చిన ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌ (ఐఈడీ)ను భద్రతా దళాలు సకాలంలో గుర్తించి నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గందర్‌బల్ జిల్లా సఫాపోరా ప్రాంతంలోని కోహెస్తాన్ కాలనీ సమీపంలో ఉన్న గులాబ్ షేక్ మొహల్లా వద్ద రోడ్డు పక్కన ఓ అనుమానాస్పద బ్యాగ్‌ను భద్రతా బలగాలు గుర్తించాయి. వెంటనే అప్రమత్తమైన జవాన్లు, స్థానిక పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని రాకపోకలను నిలిపివేశారు. ఆ బ్యాగ్‌ను క్షుణ్ణంగా పరిశీలించగా అందులో శక్తివంతమైన ఐఈడీ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

బలగాల కాన్వాయ్‌ లక్ష్యంగా..?

వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్ (బాంబు నిర్వీర్యం బృందం)కు సమాచారం అందించారు. వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అత్యంత చాకచక్యంగా ఐఈడీని నిర్వీర్యం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉగ్రవాదులు టార్గెట్ కిల్లింగ్స్ లేదా బలగాల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు పదార్థాన్ని అమర్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story