‘ప్రార్థనా స్థలాల చట్టాన్ని’ రద్దు చేయాలి.. రాజ్యసభలో బీజేపీ ఎంపీ డిమాండ్

by Dishanational4 |
‘ప్రార్థనా స్థలాల చట్టాన్ని’ రద్దు చేయాలి.. రాజ్యసభలో బీజేపీ ఎంపీ డిమాండ్
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశ ప్రయోజనాల దృష్ట్యా ‘ప్రార్థనా స్థలాల చట్టం-1991’ని రద్దు చేయాలని బీజేపీ ఎంపీ హరనాథ్‌సింగ్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ చట్టం హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధుల మతపరమైన హక్కులను దెబ్బతీస్తోందని ఆయన పేర్కొన్నారు. సోమవారం రాజ్యసభ జీరో అవర్‌లో హరనాథ్ మాట్లాడుతూ.. ‘ప్రార్థనా స్థలాల చట్టం-1991’ దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఆ చట్టం పూర్తిగా అశాస్త్రీయమైందని, రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం పాటు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రార్థనా స్థలాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకపోయారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించడాన్ని ఎంపీ హరనాథ్ ఈసందర్భంగా ప్రశంసించారు. రాజకీయ కారణాల వల్ల తమ సంస్కృతిని చూసి సిగ్గుపడే ధోరణిని కొన్ని విపక్ష పార్టీలు అలవర్చుకున్నాయన్నారు. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్, మథురలోని కృష్ణ జన్మభూమి -షాహీ ఈద్గా కేసుకు సంబంధించిన న్యాయవివాదం కొనసాగుతున్న తరుణంలో బీజేపీ ఎంపీ హరనాథ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. కాగా, ‘ప్రార్థనా స్థలాల చట్టం-1991’ అనేది 1947 ఆగస్టు 15 నాటికి ఉనికిలో ఉన్న ఏదైనా ప్రార్థనా స్థలంలో మార్పులు చేయడాన్ని నిషేధిస్తుంది. ఏదైనా ప్రార్థనా స్థలం యొక్క మతపరమైన స్వభావాన్ని కొనసాగించడానికి అనువుగా మార్గదర్శకాలను అందిస్తుంది.



Next Story

Most Viewed