Tariffs:ప్రతీకార సుంకాలు విధించలేదు.. చర్చలు కొనసాగుతున్నాయి: కేంద్రమంత్రి

by Mahesh Kanagandla |

మన దేశంపై అమెరికా ఎలాంటి ప్రతీకార సుంకాలు విధించలేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ వెల్లడించారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిస్తూ ఉభయ దేశాలు ఇంకా పరస్పరం ఎలాంటి అదనపు సుంకాలు విధించుకోలేదన్నారు. ఈ రెండు దేశాలు పరస్పరం లబ్ది పొందేలా, బహుముఖ ద్వైపాక్షి వాణిజ్య ఒప్పందంతో రెండు దేశాలకూ ప్రయోజనం సమకూరేలా నిర్ణయాలు తీసుకోవడంపై సంప్రదింపులు జరుగుతున్నాయని వివరించారు.

Tariffs:ప్రతీకార సుంకాలు విధించలేదు.. చర్చలు కొనసాగుతున్నాయి: కేంద్రమంత్రి
X

దిశ, నేషనల్ బ్యూరో: మన దేశంపై అమెరికా(America) ఎలాంటి ప్రతీకార సుంకాలు(Reciprocal Tariffs) విధించలేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్(Jitin Prasada) వెల్లడించారు. లోక్‌సభ(Lok Sabha)లో ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిస్తూ ఉభయ దేశాలు ఇంకా పరస్పరం ఎలాంటి అదనపు సుంకాలు విధించుకోలేదన్నారు. ఈ రెండు దేశాలు పరస్పరం లబ్ది పొందేలా, బహుముఖ ద్వైపాక్షి వాణిజ్య ఒప్పందంతో రెండు దేశాలకూ ప్రయోజనం సమకూరేలా నిర్ణయాలు తీసుకోవడంపై సంప్రదింపులు జరుగుతున్నాయని వివరించారు. టారిఫ్‌లు తగ్గించి, టారిఫ్‌యేతర అడ్డంకుల తొలగింపు, మార్కెట్ యాక్సెస్ పెంచడం, సప్లై చైన్ కూడా ఒకదానికొకటి పెనవేసుకుపోయేలా ప్రణాళికలు ఉండాలని రెండు దేశాలూ భావిస్తున్నాయని, అటు వైపుగానే ఒప్పందంపై చర్చ జరుగుతున్నదని పేర్కొన్నారు.

తమ వాణిజ్య భాగస్వామ్య దేశాలు దిగుమతి సుంకాలు ఏ స్థాయిలో విధిస్తున్నాయి? అమెరికా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? వంటి వివరాలపై దర్యాప్తు కోసం అమెరికా ప్రభుత్వం ఫిబ్రవరి 13న ఓ మెమోరాండం విడుదల చేసింది. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది వరకే కెనడా, మెక్సికో, చైనా దేశాలపై సుంకాలు విధించిన ట్రంప్ ప్రభుత్వం.. భారత్‌పై మాత్రం చర్యలు తీసుకోలేదు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుని, అందుకు తగినట్టుగా ఉభయ దేశాలకూ ఉపకరించేలా నిబంధనలు రూపొందించుకోవాలని భారత్, అమెరికా ప్రభుత్వాలు అంగీకరించాయి. ఒక వైపు ఈ ఒప్పందం పై కసరత్తు మొదలైనప్పటికీ ఏప్రిల్ 2 నుంచి తాము భారత్‌పైనా సుంకాలు విధిస్తామని ట్రంప్ చెప్పడం ఆందోళనలు పెంచింది. అయితే, మొన్నటి శుక్రవారం ట్రంప్ మాట్లాడుతూ అమెరికా ఉత్పత్తులపై భారత్ దిగుమతి సుంకాలు తగ్గించిందని, తాము ఆ దేశ విధానాలను బట్టబయలు చేయడంతో ఆ దేశం వెనుకడుగు వేసిందని పేర్కొన్నారు. తాజాగా, ఆ వ్యాఖ్యలు అవాస్తవమేనని కేంద్రం స్పష్టం చేసింది.

Next Story