యూపీలో కాంగ్రెస్‌తో పొత్తు ఖాయం: ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ క్లారిటీ

by Dishanational2 |
యూపీలో కాంగ్రెస్‌తో పొత్తు ఖాయం: ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ క్లారిటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి నుంచి సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) బయటకు వస్తుందనే ఊహాగానాలకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తెరదించారు. యూపీలో కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. లక్నోలోని పార్టీ కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. సీట్ షేరింగ్ విషయంలో చర్చలు సజావుగానే జరుగుతున్నాయని, త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీతో ఎలాంటి వివాదాలూ లేవని తెలిపారు. పొత్తును అధికారికంగా ప్రకటించేదుకు ఇరు పార్టీలు త్వరలోనే సమావేశమవుతాయని చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్న తరుణంలో అఖిలేష్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అంతకుముందు ఎస్పీ కాంగ్రెస్ పార్టీకి 17సీట్లను ఆఫర్ చేసింది. అయితే దీనిని కాంగ్రెస్ అంగీకరించలేదు. దీంతో రాష్ట్రంలో జరుగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రకు అఖిలేష్ దూరంగా ఉన్నారు. సీట్ల పంపకం కొలిక్కి వచ్చాకే యాత్రలో చేరుతామని స్పష్టం చేశారు. దీంతో తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

వారణాసి సీటుపై ఏకాభిప్రాయం?

యూపీలో సీట్ షేరింగ్‌పై ఉత్కంఠ నెలకొన్న తరుణంలో అఖిలేష్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. కానీ దీనిపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. అయితే ప్రస్తుతం ప్రధాని మోడీ ప్రానినిథ్యం వహిస్తున్న వారణాసి సీటును కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు ఎస్పీ అంగికరించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎస్పీ ఇప్పటికే ఓబీసీ నాయకుడు, మాజీ మంత్రి సురేంద్ర సింగ్ పటేల్‌ను ఈ స్థానం నుంచి బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించింది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టాలనే ఒప్పందం కుదిరితే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారు. యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ వారణాసి నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Next Story

Most Viewed