విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత.. పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

by Disha Web Desk 12 |
విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత.. పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీ నుంచి దోహా(ఖతార్) బయలుదేరిన ఓ ఇండిగో విమానంలో నైజీరియా దేశానికి చెందిన ఓ వ్యక్తి చనిపోవటం షాక్‌కు గురిచేసింది. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి దోహా బయలుదేరిన 30 నిమిషాల్లోనే, విమానంలోని 60 ఏళ్ల అబ్దుల్లా అనే ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విషయాన్ని గమనించిన ఎయిర్‌హోస్టర్స్, సమాచారాన్ని పైలెట్స్‌కు వివరించారు. దీంతో అప్రమత్తమైన పైలెట్లు మెడికల్ ఎమర్జెన్సీ కింద, పాకిస్తాన్‌లోని కరాచీలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ నేపథ్యంలో కరాచీలో దిగే సమయానికి మెడికల్ టీం రెడీగా ఉంది. అస్వస్థతకు గురైన వ్యక్తికి పరీక్షలు చేయగా అతను మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు.

దీంతో ఆ వ్యక్తి మృతదేహం తో తిరిగి విమానం ఢిల్లీకి చేరుకుంది. అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విమాన ప్రయాణికులను మరో విమానంలో దోహా పంపించినట్లు ఇండిగో యాజమాన్యం ప్రకటించింది. కాగా, షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు దుబాయ్‌లో విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ, విమానంలోని ప్రయాణికుడు గుండెపోటుతో చనిపోవటంతో ప్రయాణికులు తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. విమానంలో ప్రయాణికుడి మరణంపై ఎయిర్ పోర్ట్ అథారిటీ విచారం వ్యక్తం చేసింది. సరైన సమయంలో చికిత్సకు ఏర్పాట్లు చేసినా ఫలితం లేదని, అతని కుటుంబానికి తీరని లోటని పేర్కొంది. మిగతా ప్రయాణికుల విషయంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, ఇది అనుకోని ఘటన అని వివరించింది.

Next Story

Most Viewed