ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి ప్రమాదం.. రన్‌వే లైట్లను ఢీకొట్టిన బోయింగ్ 737

by Kema Shiva Kumar |

మస్కట్ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి ప్రమాదం.. రన్‌వే లైట్లను ఢీకొట్టిన బోయింగ్ 737
X

దిశ, వెబ్‌డెస్క్: ఒమన్‌ రాజధాని మస్కట్ (Muscat) అంతర్జాతీయ విమానాశ్రయంలో కేరళకు రావాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అవుతున్న సమయంలో రన్‌వే మధ్యలో వెళ్లాల్సిన ఫ్లైట్ పొరపాటున పక్కనే ఉండే ఎడ్జ్ లైట్లపైకి వెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఒమన్ విమాన ప్రమాదాల దర్యాప్తు విభాగం (AAIS) దీనిని తీవ్రమైన ప్రమాదంగా వర్గీకరించి అధికారిక దర్యాప్తునకు ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే.. మస్కట్ నుంచి కేరళలోని కన్నూర్‌కు బయలుదేరాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ (IX 712) రాత్రి 9.10 గంటల సమయంలో టేకాఫ్‌కు సిద్ధమైంది. బోయింగ్ 737-800 రకానికి చెందిన ఈ విమానాన్ని ఓ విదేశీ పైలట్, భారతీయ ఫస్ట్ ఆఫీసర్ నడుపుతున్నారు. రాత్రి వేళ చీకటిగా ఉండటంతో.. పైలట్లు విమానాన్ని రన్‌వే సెంటర్‌లైన్‌పై కాకుండా, కుడి వైపు చివరన ఉండే రన్‌వే ఎడ్జ్ లైట్ల లైన్‌లో అమర్చి టేకాఫ్ స్పీడ్ పెంచారు. విమానం వేగంగా వెళ్తున్న క్రమంలో రన్‌వే అంచున ఉన్న అనేక లైట్లను బలంగా ఢీకొట్టింది. ఓ పెద్ద శబ్దం (Big Bang) రావడంతో పాటు కాక్‌పిట్‌లో ‘మాస్టర్ కాషన్’ అలారం మోగడంతో అప్రమత్తమైన పైలట్లు వెంటనే టేకాఫ్‌ను నిలిపివేసి (Rejected Take-off), విమానాన్ని రన్‌వేపైనే ఆపేశారు. ఈ ప్రమాదం కారణంగా విమానం టైర్ పగిలిపోవడంతో పాటు కంప్లీట్ హైడ్రాలిక్ లీకేజీ (Hydraulic Leak) ఏర్పడింది. రన్‌వే లైట్ల ముక్కలు ఇంజిన్‌లోకి వెళ్లడంతో (Foreign Object Ingestion) విమానం ఇంజిన్ కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్‌పోర్ట్ సిబ్బంది రన్‌వే పైనే ప్రయాణికులను సురక్షితంగా దించి, బస్సుల ద్వారా టెర్మినల్‌కు తరలించారు.

Next Story