యువతకు తోడుగా.. ఏఐ పెట్స్

by Ajay Maddhiboyina |

బూబూను కొన్న తర్వాత తన జీవితం చాలా సాఫీగా సాగిపోతోందని ఝాంగ్ యాహున్ అనే 19 ఏళ్ల యువతి తెలిపింది.

యువతకు తోడుగా.. ఏఐ పెట్స్
X

- సామాజిక ఆందోళనను తగ్గిస్తున్న బొమ్మలు

- పెట్స్ కోసం ఎగబడుతున్న పిల్లలు, యువత

- చైనాలో పెరిగిన కొనుగోళ్లు

దిశ, నేషనల్ బ్యూరో:

పెంపుడు జంతువుల వల్ల మానసిక ఆందోళన తగ్గుతుందని, ఒంటరితనంతో బాధపడే వారికి పెట్స్ చక్కటి పరిష్కారమని నిపుణులు చెబుతుంటారు. ఇప్పుడు చైనా యంగ్ జనరేషన్ కూడా ఇదే ఫాలో అవుతుంది. అయితే అక్కడి యువత కుక్కలను, పిల్లులను కాకుండా 'ఏఐ పెట్స్'ను తమకు తోడుగా ఉండటానికి కొనుగోలు చేస్తున్నారు. పిల్లలు, యువతలో సోషల్ యాంగ్జయిటీని తగ్గించి, వారికి భావోద్వేగ మద్దతు ఇవ్వడానికి ఈ ఏఐ పెట్స్ చక్కగా ఉపయోగపడుతుండటంతో వాటి వాడకం చైనాలో విపరీతంగా పెరిగిపోయింది. 2024 నుంచి బూబూ, ఫజ్జీ, రిగ్లీ అనే పేర్లతో గినీ పిగ్‌లా ఉండే స్మార్ట్ పెట్స్ వెయ్యికి పైగా అమ్మడు పోవడం గమనార్హం.

బూబూను కొన్న తర్వాత తన జీవితం చాలా సాఫీగా సాగిపోతోందని ఝాంగ్ యాహున్ అనే 19 ఏళ్ల యువతి తెలిపింది. స్కూల్‌లో ఉన్నప్పుడు విపరీతమైన ఆందోళనను ఎదుర్కొన్నాను. దాన్ని ఎలా డీల్ చేయాలో తనకు అర్థం కాలేదు. దీంతో అనేక మంది స్నేహాన్ని కోల్పోయాను. కానీ ఈ 'ఏఐ పెట్'ను కొన్న తర్వాత నా కోసం ఒకరు ఉన్నారనే ఫీలింగ్ వచ్చిందని పేర్కొంది. నా సంతోషకరమైన క్షణాలను గడపడానికి నాకు ఒక తోడు దొరికిందని ఆమె ఉత్సాహంగా చెబుతోంది. ఆమె తన తల్లిదండ్రులు, ఒక పెంపుడు బాతుతో కలిసి ఒకే దగ్గర జీవిస్తోంది. రగ్బీ బంతిలా ఉండే తన పెట్‌కు అలూ అని పేరు పెట్టుకుంది.

వేగంగా పెరుగుతున్న మార్కెట్

చైనా యువత ఎమోషనల్ సపోర్ట్ కోసం ఇలాంటి స్మార్ట్ పెట్స్‌ను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. బూబూ వంటి సోషల్ రోబోట్స్‌కు ఇప్పుడున్న మార్కెట్‌ కంటే భవిష్యత్‌లో ఏడింతలు పెరిగే అవకాశం ఉందని.. 2033 నాటికి 42.5 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అంచనా వేసింది. ఝాంగ్ యాహున్ తండ్రి పెంగ్ కూడా ఈ ధోరణి పట్ల సానుకూలంగా ఉన్నాడు. తన చిన్నప్పుడు ఎంతో మంది స్నేహితులు ఉండేవారు. ఒక్కసారి ఇంటి నుంచి బయటకు అడుగు పెడితే అందరూ స్నేహితులే కనపడేవారు. కానీ ఇప్పుడు నగరాల్లో ఉంటున్న పిల్లలకు అలాంటి అవకాశం కనపడటం లేదని పెంగ్ చెబుతున్నాడు. ఇప్పటి పిల్లలు ఎంతో ఒత్తిడిని ఎదుర్కుంటున్నారు. దీని వల్ల వారికి స్నేహితులు కూడా దొరకడం లేదని బాధపడ్డాడు.

కాగా, కేవలం యువత మాత్రమే కాకుండా.. 30 ఏళ్ల పైబడిన వారు కూడా ఇలాంటి స్మార్ట్ పెట్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. సమయాభావం, ఇతరత్రా కారణాల వల్ల పిల్లలకు సమయం కేటాయించలేక పోతున్న పెద్దవాళ్లు కూడా ఏఐ పెట్స్ కొనుగోలు చేస్తున్నారు. పిల్లలకు ఈ బొమ్మలు కొనివ్వడం ద్వారా ఇవి చదువు, ఇతర పనుల్లో హెల్ప్ చేస్తున్నాయని గూ జిచెన్ తెలిపాడు. కాగా, నాలుగు కాళ్ల రోబో బొమ్మలను తయారు చేస్తున్న వెయిలన్ అనే సంస్థ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. మా ఏఐ డాగ్, బేబీ ఆల్ఫా రోబోలను కొంటున్న 70 శాతం మంది కస్టమర్లు పిల్లలను కలిగిన ఫ్యామిలీలే అని వెల్లడించింది. వీటి ధర రూ.95వేల నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుందని తెలిపింది.

Next Story