అహ్మదాబాద్‌ ఎయిరిండియా ప్రమాదం.. ‘ఫౌండేషన్‌ ఆఫ్‌ ఏవియేషన్‌ సేఫ్టీ’ సంచలన రిపోర్టు

by Kema Shiva Kumar |

అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి సంబంధించి కొత్త విషయాలు బయటకు వచ్చాయి. ఈ మేరకు అమెరికాకు చెందిన ఏవియేషన్ సేఫ్టీ గ్రూప్ సంస్థ తన రిపోర్టులో దిగ్భ్రాంతికరమైన నిజాలను వెల్లడించింది

అహ్మదాబాద్‌ ఎయిరిండియా ప్రమాదం.. ‘ఫౌండేషన్‌ ఆఫ్‌ ఏవియేషన్‌ సేఫ్టీ’ సంచలన రిపోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా (AI-171) విమాన ప్రమాదానికి సంబంధించి తాజాగా ఓ దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి గురైన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం గత 11 ఏళ్లుగా తీవ్రమైన ఎలక్ట్రికల్, సాంకేతిక సమస్యలతో సతమతమవుతోందని అమెరికాకు చెందిన ‘ఫౌండేషన్ ఫర్ ఏవియేషన్ సేఫ్టీ’ (Foundation for Aviation Safety) వెల్లడించింది. VT-ANB రిజిస్ట్రేషన్‌తో ఫిబ్రవరి 2014లో భారత్‌కు వచ్చిన ఆ విమానం మొదటి రోజు నుంచే ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటోందని సేఫ్టీ గ్రూప్ పేర్కొంది. సర్వీస్ కాలం మొత్తం సర్క్యూట్ బ్రేకర్లు ట్రిప్ అవ్వడం, వైరింగ్ దెబ్బతినడం వంటి సమస్యలు తరచూ తలెత్తాయని వెల్లడించింది.

గతంలోనే అగ్నిప్రమాదం..

2022 జనవరిలో ఇదే విమానంలోని ‘P100 పవర్ ప్యానెల్’లో భారీ అగ్నిప్రమాదం జరిగిందని, ఆ సమయంలో ప్యానెల్‌ను పూర్తిగా మార్చాల్సి వచ్చిందని సేఫ్టీ గ్రూప్ తన నివేదికలో వివరించింది. భారత విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ (AAIB) ప్రాథమిక నివేదికలో ‘పైలట్ తప్పిదం’ వల్లే ఇంజిన్లకు ఇంధనం సరఫరా నిలిచిపోయిందని పేర్కొన్నారు. అయితే, విమానంలో ఉన్న దీర్ఘకాలిక ఎలక్ట్రికల్ లోపాల వల్లే పైలట్లు నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని, ఈ కోణాన్ని దర్యాప్తు అధికారులు విస్మరించారని FAS ఆరోపించింది.

విజిల్‌బ్లోయర్ రిపోర్ట్..

ఫౌండేషన్ ఫర్ ఏవియేషన్ సేఫ్టీ సంస్థ తన వద్ద ఉన్న ఆధారాలను అమెరికా సెనేట్ (US Senate) కమిటీకి సమర్పించింది. 260 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘోర ప్రమాదానికి కేవలం పైలట్లే బాధ్యులు కాదని, విమాన తయారీ, నిర్వహణ లోపాలు కూడా కారణమని స్పష్టం చేసింది. ప్రస్తుతం ‘ఫౌండేషన్ ఫర్ ఏవియేషన్ సేఫ్టీ’ ఇచ్చి రిపోర్టు అంతర్జాతీయ విమానయాన రంగంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ విషయంపై ఎయిరిండియాతో పాటు బోయింగ్ సంస్థలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Next Story