హీట్‌వేవ్‌ నుంచి రక్షణకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల జారీ

by Dishanational1 |
హీట్‌వేవ్‌ నుంచి రక్షణకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల జారీ
X

దిశ, నేషనల్ బ్యూరో: వేసవి కాలం ఇంకా మొదలవ్వకముందే సూర్యుడు వేడికి చాలామంది తాళలేకపోతున్నారు. పెరుగుతున్న ఎండ కారణంగా బయటకు వెళ్లాలన్న ప్రజలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వేసవికాలం మొదలవడం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేడిగాలుల నుంచి రక్షణ కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి డా మన్సూక్ మాండవియా నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో దీని గురించి చర్చించినట్టు, ఎండ వేడి కారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడినట్టు అధికారులు తెలిపారు. హీట్‌వేవ్‌ల నివారణ చర్యలపై ప్రజల్లో సమయానకూలంగా అవగాహన అవసరమని మంత్రి వివరించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం, ప్రజలు ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండాలి. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది, మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల మధ్య ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచించారు. అలాగే, ఎండలో పనులు చేయడానికి దూరంగా ఉండాలని, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య వంటలు చేయవద్దని, కార్లు, ఇతర వాహనాల్లో పిల్లలను, పెంపుడు జంతువులను వదిలి మర్చిపోవద్దు, ఆల్కాహాల్, టీ, కాఫీ, చక్కెరతో కూడిన డ్రింక్స్ వంటి వాటిని తీసుకోకూడదని పేర్కొంది. చెప్పులు లేకుండా ఎండలో బయటకు వెళ్లకూడదు. ఒంటరిగా ఉండే వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండటం, ఇళ్లలో కర్టెన్లు, షట్టర్లు, సన్‌షెడ్‌లను ఉపయోగించడం, రాత్రిపూట కిటికీలను తెరిచి ఉంచడం, పగటిపూట కింద అంతస్తుల్లో ఉండేందుకు ప్రయత్నించాలి. శరీరాన్ని చల్లగా ఉంచేందుకు ఫ్యాన్, తడి బట్టలను ఉపయోగించాలని సూచించారు.



Next Story

Most Viewed