మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు మోడీ ఎక్కడున్నారు

by Dishanational1 |
మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు మోడీ ఎక్కడున్నారు
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో రగులుతున్న సందేశ్‌ఖాలీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ తృణమూల్ కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. గురువారం స్పందించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మోడీపై నిప్పులు చెరిగారు. కోల్‌కతాలో మహిళలకు మద్దతుగా దీదీ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సందేశ్‌ఖాలీకి చెందిన కొందరు మహిళలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానీ మోడీ, బీజేపీ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. బెంగాల్‌లో మహిళలను హింసిస్తున్నట్టు బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు, హత్రాస్‌లో మహిళపై అత్యాచారం చేసి, ఆమె మృతదేహాన్ని బలవంతంగా దహనం చేసినట్టు మోడీ ఎక్కడున్నారు. బెంగాల్‌లోనే మహిళలు అత్యంత సురక్షితంగా ఉన్నారని, దీని తాను నిరూపించగలదని దీదీ సవాలు చేశారు. 'చాలామంది సందేశ్‌ఖాలీపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. ఏదైనా ఘోరం జరిగితే చర్యలు తీసుకుంటాం. తృణమూల్ కాంగ్రెస్ నేతలను కూడా అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టం. కానీ, బీజేపీ అలా చేయదు. ఈడీ, సీబీఐలను ఉసిగొల్పడం, నేతలను అరెస్ట్ చేయడం.. అలా ఎన్నికల్లో విజయం సాధించడం చేస్తుంది. బెంగాల్‌పై బీజేపీకి ఎందుకు అంత కోపం? మీకు గెలిచే సత్తా ఉన్నప్పుడు ప్రతిపక్షాల పరువు తీయడం ఎందుకు? అని' మమతా బెనర్జీ ప్రశ్నించారు. శుక్రవారం(మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఒకరోజు ముందు దీదీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఇటీవల రాజ్యసభకు ఎంపికైన సాగరిక ఘోష్, పార్టీ నేతలు పాల్గొన్నారు.



Next Story