ప్రాణం తీసిన ఐపీఎల్ బెట్టింగ్

by Dishanational1 |
ప్రాణం తీసిన ఐపీఎల్ బెట్టింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: బెట్టింగ్ మహమ్మారి కారణంగా ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్‌లో లక్షలు, కోట్ల కొద్ది డబ్బు పొగొట్టున్నవారు కోకొల్లలు. మరెంతోమంది అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు. తాజాగా కర్ణాటకలో ఇలాంటి ఘటనే ఒక కుటుంబంలో విషాదం నింపింది. ఐపీఎల్ బెట్టింగ్‌కు బానిసైన భర్త విపరీతంగా అప్పులు చేయడంతో ఓ భార్య ఆత్మహత్య చేసుకోవడం అందిరినీ కలచివేసింది. వివరాలోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన దర్శన్ బాబు హోసదుర్గలోని మైనర్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతను 2020లో రంజిత అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కొత్త జీవితాన్ని ప్రారంభించిన వీరి జీవితంలోకి క్రికెట్ బెట్టింగ్ 2021లో ప్రవేశించింది. ఆ ఏడాది దర్శన్ బాబు ఐపీఎల్ గేమ్‌లపై బెట్టింగ్ చేయడం ప్రారంభించాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయి. అయినప్పటికీ 2023 వరకు దర్శన్ ఐపీఎల్ మ్యాచ్‌లలో భారీ మొత్తం బెట్టింగ్ వేశాడు. కానీ డబ్బు పెట్టిన ప్రతిసారి ఓడిపోవడంతో చివరకు రూ. 1.50 కోట్ల వరకు అప్పుల్లో మునిగిపోయాడు. అందులో రూ. కోటి వరకు అప్పులు తీర్చినప్పటికీ ఇంకా రూ. 84 లక్షల వరకు అప్పులు ఉన్నట్టు సమాచారం.

దీనికి సంబంధించి వడ్డీ వ్యాపారులు తరచూ డబ్బు తిరిగివ్వాలని వేధిస్తుండటంతో, రంజిత భరించలేక ఆత్మహత్య చేసుకుందని పోలీసు అధికారులు వెల్లడించారు. తన కూతురు రంజిత ఆత్మహత్యకు వడ్డీ వ్యాపారులే కారణమని రంజిత తండ్రి వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్శన్‌కు సైతం బెట్టింగ్ ఇష్టం లేదని, కొందరు పనిగట్టుకుని అతని చేత బలవంతంగా బెట్టింగ్స్ వేయించారని ఆయన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో రంజిత ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాపు ప్రారంభించారు.


Next Story