అదానీ-హిండెన్ బర్గ్ వివాదం: కీలక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు

by Dishanational2 |
అదానీ-హిండెన్ బర్గ్ వివాదం: కీలక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: అదానీ-హిండెన్ బర్గ్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) అవసరం లేదని స్పష్టం చేసింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) తన ఇన్వెస్టిగేషన్‌ను కొనసాగిస్తుందని తెలిపింది. సెబీ ఇన్వెస్టిగేషన్‌లో లోపాలున్నాయని గుర్తించడానికి ఎటువంటి ఆధారాలూ లేవని వెల్లడించింది. సెబీ రెగ్యులేటరీ ప్రేమ్ వర్కులో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణల తర్వాత వీటిపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్థీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. సెబీ చట్టప్రకారం విచారణ కొనసాగిస్తుందని, మూడు నెలల్లోగా దానిని పూర్తి చేయాలని ఆదేశించింది. కాగా, గతేడాది అమెరికాకు చెందిన హిండన్ బర్గ్ సంస్థ అదానీ గ్రూపుపై పలు ఆరోపణలు చేయగా.. అదానీ కంపెనీల షేర్లు భారీగా పతనమైన విషయం తెలిసిందే. ఈ అంశం దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని సైతం రేపింది.



Next Story

Most Viewed