Punjab MLA: అనుమానాస్పద స్థితిలో ఆప్ ఎమ్మెల్యే మృతి

by Shamantha N |

పంజాబ్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. లుథియానా వెస్ట్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆప్ (AAP) ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ గోగీ (58) (Gurpreet Gogi) బుల్లెట్ గాయాలతో మరణించారు.

Punjab MLA: అనుమానాస్పద స్థితిలో ఆప్ ఎమ్మెల్యే మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. లుథియానా వెస్ట్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆప్ (AAP) ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ గోగీ (58) (Gurpreet Gogi) బుల్లెట్ గాయాలతో మరణించారు. గోగీకి శుక్రవారం అర్ధరాత్రి బుల్లెట్‌ గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన తలలో రెండు బుల్లెట్‌లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే, ఆయన తన పిస్టల్ ని శుభ్రం చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ తుపాకీ పేలినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు తన గదిలో గోగీ ఒక్కరే ఉన్నట్లు వెల్లడించారు. బుల్లెట్ గాయాలు తగిలిన వెంటనే దయానంద్ మెడికల్ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. అక్కడికి చేరుకునేలోగానే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ కుల్దీప్ సింగ్‌ చాహల్‌ పేర్కొన్నారు. శవపరీక్ష తర్వాత మరణానికి అసలైన కారణం తెలుస్తోందని పోలీసులు తెలిపారు.

రెండుసార్లు ఎమ్మెల్యేగా..

2022లో ఆప్ పార్టీలో చేరిన గోగీ.. లుథియానా నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పంజాబ్ వెస్ట్ నుంచి మాజీమంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే భరత్ భూషణ్ అషుపై గెలుపొందారు. మరోవైపు, శుక్రవారం లుథియానా బార్ అసోసియేషన్ లో పంజాబ్ స్పీకర్ కుల్తార్ సంధ్వాన్ తో కలిసి ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాల్వాలోని డ్రైనేజీని క్లీన్ చేయాలని కోరినట్లు సోషల్ మీడియా ఎక్స్ లో కోరుకున్నారు.

Next Story