కేజ్రీవాల్‌కు బీజేపీ షాక్.. ఆప్ ఒక్కగానొక్క లోక్‌సభ ఎంపీ జంప్

by Dishanational4 |
కేజ్రీవాల్‌కు బీజేపీ షాక్.. ఆప్ ఒక్కగానొక్క లోక్‌సభ ఎంపీ జంప్
X

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉండగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆప్‌కు చెందిన ఏకైక లోక్‌సభ ఎంపీ సుశీల్ కుమార్ రింకూ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వేదికగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేల సమక్షంలో జలంధర్ (పంజాబ్) ఆప్ ఎంపీ సుశీల్ కాషాయ కండువా కప్పుకున్నారు. ఈసందర్భంగా జలంధర్ వెస్ట్ ఎమ్మెల్యే శీతన్ అంగురల్‌ కూడా కమలదళంలో చేరారు. ఈసందర్భంగా సుశీల్ కుమార్ రింకూ మాట్లాడుతూ.. ‘‘మా పార్టీ (ఆప్) నాకు మద్దతుగా నిలవలేదు. ఫలితంగా నా నియోజకవర్గ (జలంధర్) ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల పనితీరును చూసి ప్రభావితుడినై బీజేపీలో చేరుతున్నాను’’ అని వెల్లడించారు. ‘‘జలంధర్ లోక్‌సభ నియోజకవర్గం అభివృద్ధి కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇకపై కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులన్నింటినీ జలంధర్‌కు తీసుకొస్తా’’ అని ఆయన పేర్కొన్నారు.

సుశీల్ కుమార్ రింకూ బ్యాక్ గ్రౌండ్‌..

సుశీల్ కుమార్ రింకూ బ్యాక్ గ్రౌండ్‌లోకి వెళితే.. ఆయన తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. 2022 సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జలంధర్ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. అయితే 2023 సంవత్సరం మేలో జలంధర్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక రావడంతో కాంగ్రెస్ టికెట్‌ను ఆశించి సుశీల్ భంగపడ్డారు. దీంతో ఆయన ఆప్‌ తరఫున బరిలోకి దిగి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక తాను అంతకుముందు ప్రాతినిధ్యం వహించిన జలంధర్ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుంచి తన కీలక అనుచరుడు శీతన్ అంగురల్‌‌కు ఆప్ టికెట్ దక్కేలా చేసి గెలిపించుకున్నారు. అందుకే ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసికట్టుగా బీజేపీలో చేరారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed