హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ కార్యకర్తల దాడి.. గోడలపై ‘గద్దార్’ అంటూ నిరసన!

by Malleboina Mahesh |

హర్భజన్ సింగ్ బీజేపీలో చేరడంపై ఆప్ కార్యకర్తలు మండిపడుతున్నారు. జలంధర్‌లోని ఆయన ఇంటి గోడలపై 'గద్దార్' అని రాసి తమ నిరసనను వ్యక్తం చేశారు.

హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ కార్యకర్తల దాడి.. గోడలపై ‘గద్దార్’ అంటూ నిరసన!
X

దిశ, వెబ్ డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీని (AAP) వీడి బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ (MP Harbhajan Singh) నివాసం వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు జలంధర్‌లోని హర్భజన్ ఇంటిని చుట్టుముట్టి భారీ నిరసన చేపట్టారు. పార్టీకి వెన్నుపోటు పొడిచారని ఆగ్రహించిన కార్యకర్తలు ఆయన నివాసం వెలుపల ఉన్న గోడలపై నల్ల రంగుతో 'గద్దార్' (ద్రోహి/దేశద్రోహి) అని రాశారు. "భజ్జీ బీజేపీలోకి పారిపోయాడు" అంటూ నినాదాలు చేస్తూ, తమను వంచించినందుకు ఆయన సిగ్గుపడాలని మండిపడ్డారు.

మేయర్ వనీత్ ధీర్, ఆప్ నేత నితిన్ కోహ్లీ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. హర్భజన్‌ను "అమ్ముడుపోయిన నేత"గా అభివర్ణిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. పరిస్థితి విషమించడంతో హర్భజన్ సింగ్ నివాసం, ఎంపీ అశోక్ మిట్టల్‌కు చెందిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాఘవ్ చడ్డా సహా ఏడుగురు ఎంపీలు ఒక్కసారిగా బీజేపీలో విలీనం కావడంతో, పంజాబ్‌లో ఆప్ ఉనికి ప్రమాదంలో పడిందని, ఈ ద్రోహాన్ని ప్రజలు ఎన్నటికీ క్షమించరని ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆప్ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.

Next Story