అసోంలో మూడు స్థానాల్లో ఆప్ పోటీ: సీట్ షేరింగ్ చర్చల నేపథ్యంలో కీలక పరిణామం

by Dishanational2 |
అసోంలో మూడు స్థానాల్లో ఆప్ పోటీ: సీట్ షేరింగ్ చర్చల నేపథ్యంలో కీలక పరిణామం
X

దిశ, నేషనల్ బ్యూరో: త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో అసోంలో మూడు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సందీప్ పాఠక్ రాష్ట్రంలోని మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలిపారు. దిబ్రూగఢ్ నుంచి మనోజ్ ధనోహర్, గౌహతి నుంచి భవెన్ చౌదరి, సోనిత్‌పూర్ నుండి రిషి రాజ్ ఆప్ తరఫున బరిలో ఉంటారని వెల్లడించారు. ‘ఇండియా కూటమిలో ఆప్ భాగస్వామి. ఈ ప్రతిపాదనను అంగీకరిస్తుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎన్నికల్లో గెలవడం చాలా ముఖ్యం. ఈ మూడు స్థానాల్లో గెలవడానికి ఆప్ వెంటనే సన్నాహాలు ప్రారంభిస్తుంది’ అని చెప్పారు. ఎన్నికలకు తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉందని, కాబట్టి సీట్ షేరింగ్ చర్చలు వేగవంతం చేయాలని తెలిపారు. పొత్తులపై వెంటనే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కాగా, ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ ఏకపక్షంగా 16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అసోంలో ఆప్ అభ్యర్థులను ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే దీనిపై కాంగ్రెస్ నుంచి గానీ, ఇండియా కూటమి నుంచి గానీ స్పందన రాలేదు.


Next Story