భారత దౌత్యానికి ఇది పరీక్ష

by Ajay Maddhiboyina |

తాజాగా శనివారం యూఎస్ మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్2లో 119 మంది భారత అక్రమ వలసదారులు స్వదేశానికి చేరుకోనున్నారు.

భారత దౌత్యానికి ఇది పరీక్ష
X

- అందరి దృష్టి ఆ విమానంపైనే

- అక్రమ వలసదారుల రాకపై చిదంబరం వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా నుంచి అక్రమ వలసదారులను తీసుకొని వస్తున్న విమానం రాకపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది భారత దౌత్యానికి పరీక్ష వంటిదని సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం వ్యాఖ్యానించారు. భారత్‌కు చెందిన 119 మంది అక్రమ వలసదారులతో కూడిన విమానం అమృత్‌సర్‌లో దిగడానికి కొన్ని గంటల ముందు చిదంబరం 'ఎక్స్' వేదికగా స్పందించారు. 'ఇప్పుడు అందరి కళ్లు యూఎస్ నుంచి వచ్చే విమానంపైనే ఉంది. అక్రమ వలసదారుల చేతులకు సంకెళ్లు వేసి, తాళ్లతో కాళ్లు కట్టేసి పంపుతారా అని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇది భారత దౌత్యానికి ఒక పరీక్షలాంటిది' అని చిదంబరం వ్యాఖ్యానించారు. భారత విదేంశాంగ మంత్రిత్వ శాఖ ఈ డీపోర్టేషన్ ప్రక్రియను సరిగా నిర్వహించడం లేదని చిదంబరం ఆరోపించారు. కాగా, ఫిబ్రవరి 5న తొలి డీపోర్టేషన్ విమానం వచ్చినప్పుడు అందులో అక్రమ వలసదారులను బంధీలుగా చేసి పంపారు. చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేసి పంపడం వివాదాస్పదమైంది. దీనిపై ప్రతిపక్షాలు పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీశాయి.

తాజాగా శనివారం యూఎస్ మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్2లో 119 మంది భారత అక్రమ వలసదారులు స్వదేశానికి చేరుకోనున్నారు. ఇందులో అత్యధికులు పంజాబ్‌కు చెందిన వారే. మిగిలిన వారు హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, గోవా, రాజస్థాన్, మహారాష్ట్ర, జమ్ము కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు.

Next Story