2024 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ రూప్ మ్యాప్

by Disha Web Desk 2 |
2024 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ రూప్ మ్యాప్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో సాధించిన విజయాలు, చేరుకున్న లక్ష్యాలను ప్రజలకు వివరించేలా ప్రత్యేక కార్యచరణను ప్రకటించింది. 2024 ఎన్నికలు లక్ష్యంగా రూపొందించిన కార్యక్రమాల వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ మంగళవారం ఢిల్లీలో మీడియాకు వివరించారు. 'సేవా, సుపరిపాలన, పేదల సంక్షేమం' పేరుతో దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రచారం చేపట్టబోతున్నట్టు తరణ్ చుగ్ తెలిపారు. రేపు రాజస్థాన్ లోని అజ్మీర్ నుంచి ప్రచార ర్యాలీని ప్రధాని ప్రారంభిస్తారని, ఈ ర్యాలీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షా సహా పలువురు కేబినెట్ మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు హాజరు అవుతాలని తెలిపారు. అన్ని ప్రాంతాల రిపోర్ట్ కార్డుతో ప్రజలు, మీడియా ముందుకు వెళ్లబొతున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 500 పైగా భారీ సభలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈ క్రమంలో 5 లక్షల మంది ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధులు దగ్గరకు పార్టీ నేతలు, ఎంపీలు వెళ్తారని తెలిపారు.

లోక్ సభ స్థానాలే టార్గెట్:

144 క్లస్టర్ల విభజించి ప్రతి క్లస్టర్ లో 3 నుంచి 4 లోక్ సభ స్థానాలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసింది. క్లస్టర్ల వారీగా 9 ఏళ్ల పాలనపై ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గంలో కనీసం 1000 మంది ప్రముఖులను కలిసి 9 ఏళ్ల పాలన విజయాలను వివరించడంతో పాటు ఒక ప్రముఖమైన అభివృద్ధి కార్యక్రమాన్ని చెప్పడం, దాని ఆధారంగా స్థానికంగా ప్రచార కార్యక్రమం నిర్వయించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందులో భాగంగా జూన్ 3 నుంచి జూన్ 30 వరకు బూత్ స్థాయిలో ప్రతి ఇంటికి బీజేపీ శ్రేణులు వెళ్తాయని చెప్పారు. యువత, మహిళలు ఇలా అన్ని రంగాల ప్రజలను చేరువ అయ్యేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 10 లక్షల మంది కార్యకర్తలతో డిజిటల్ ర్యాలీ నిర్వహించాలని తలపెట్టారు. దీనిలో ప్రధాని మోడీ హాజరు అవుతారని తరుణ్ చుగ్ వెల్లడించారు.

ఎంపీలకు టార్గెట్:

ఈ కార్యాచరణలో భాగంగా ప్రతి ఎంపీ సొంత నియోజకవర్గం కాకుండా తనకి కేటాయించిన నియోజకవర్గంలో కనీసం 8 రోజులు పనిచేసేలా ప్రణాళిక రూపొందించారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన రోజు, శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి నాడు ప్రత్యేక కార్యక్రమాలు ఉండనున్నాయి. బీజేపీ 9 ఏళ్ల పాలనను సమర్థించేవారు మిస్ కాల్ ఇవ్వడం కోసం ప్రత్యేకంగా నెంబర్ 9090902024 ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మోడీ పాలనలో అనేక మార్పులు తీసుకువచ్చామని అవినీతి రహిత పాలన అందిస్తున్నామని తరుణ్ చుగ్ తెలిపారు. మోడీ హయాంలో అయోధ్య నిర్మాణం పూర్తి కావస్తోందన్నారు. త్రిబుల్ తలాక్ రద్దు చేశాం. విద్య, వైద్య, మౌలిక సదుపాయాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చామని చెప్పారు. ఉగ్రవాద దాడులు జరిగితే తెల్ల జెండా చూపించి క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించే ప్రభుత్వం కాదని సర్జికల్ స్ట్రైక్స్ చేసే ప్రభుత్వం మాదని తెలిపారు. కోట్లాది మంది పేదల సొంత ఇంటి కల నెరవేర్చామని ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ తొమ్మిదేళ్ల కాలంలో అమలు చేశామని చెప్పారు.

Next Story