దాయాది పాక్‌కు దిమ్మతిరిగే షాక్.. ఆ రెండు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ధ్వంసం

by Shiva |   ( Updated:2025-05-09 03:57:02.0  )
దాయాది పాక్‌కు దిమ్మతిరిగే షాక్.. ఆ రెండు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ధ్వంసం
X

దిశ, వెబ్‌డెస్క్: గంటలు గడుస్తున్నా కొద్దీ భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రతరం అవుతున్నాయి. ఓవైపు పాక్ ప్రయత్నాలను తిప్పికొడుతూనే.. మరోవైపు ఆ దేశంపై ఇండియన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో దాయాది పాక్ ఏం చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గురువారం రాత్రి భారత్ జరిపిన దాడిలో పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. అక్కడున్న రెండు ప్రధాన వైమానిక రక్షణ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసినట్లుగా భారత రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. సర్గోధా, ఫైసలాబాద్‌ పరిధిలోని ఎయిర్ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ను నాశనం చేశామని పేర్కొన్నారు. అదేవిధంగా పాకిస్థాన్‌లోని పంజాబ్ ఎయిర్‌బోర్న్ వార్నింగ్ సిస్టమ్స్‌ను కూడా క్యాప్చర్ చేసి పేల్చి వేసినట్లుగా భారత సైనిక ఉన్నతాధికారులు తెలిపారు.

మొత్తం 50 డ్రోన్ల కూల్చివేత..

పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిగా విస్మరించి జమ్మూకశ్మీర్‌లో పౌరులు, మిలటరీ వాహనాలే లక్ష్యంగా దాడులకు దిగుతోంది. LOC వెంట గురువారం రాత్రి పాక్‌కు చెందిన 50 డ్రోన్లను భారత్‌ కూల్చింది. ఉధంపూర్‌, సాంబా, జమ్ము, అఖ్నూర్‌, నగ్రోటా, పఠాన్‌కోట్ ప్రాంతాల్లో వీటిని కూల్చివేసింది. L70 గన్స్‌, ZU-23 MM, అధునాతన ఆయుధాలతో డ్రోన్లను భారత్‌ నాశనం చేసింది.

ఇండియన్ ఆర్మీ ట్వీట్..

పాకిస్థాన్‌పై దాడులపై ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ వేదికగా ట్వీట్ చేసింది. ‘పాకిస్తాన్ సాయుధ దళాలు 2025 మే 08, 09 తేదీల మధ్య రాత్రి మొత్తం పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు, ఇతర మందుగుండు సామగ్రిని ఉపయోగించి అనేక దాడులను ప్రారంభించాయి. జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు కూడా అనేక కాల్పుల విరమణ ఉల్లంఘించాయి. అప్రమత్తమైన భద్రతా దళాలు పాక్ డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టారు. అదేవిధంగా సరిహద్దు వెంట కూడా ఎదురుకాల్పులతో సరైన సమాధానం ఇచ్చారు. భారత సైన్యం, దేశం యొక్క సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉంది. అన్ని దుర్మార్గపు కుట్రలకు బలంగా సమాధానిస్తాం అంటూ ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది.



Next Story

Most Viewed