- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజస్థాన్ను కమ్మేసిన రాకాసి ఇసుక తుఫాన్.. పట్టపగలే అంధకారంగా మారిన ఆ నగరం
రాజస్థాన్ రాష్ట్రంలో మరోసారి రాకాసి ఇసుక తుఫాన్ కమ్మేసింది. సోమవారం చురు జిల్లాలో గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఈ తుఫాను ధాటికి పట్టపగలే ఆ ప్రాంతమంతా చీకటిమయంగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాజస్థాన్ రాష్ట్రంలో మరోసారి రాకాసి ఇసుక తుఫాన్ కమ్మేసింది. సోమవారం చురు జిల్లాలో గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఈ తుఫాను ధాటికి పట్టపగలే ఆ ప్రాంతమంతా చీకటిమయంగా మారింది. దట్టమైన ఇసుక మేఘాల మాదిరి అలుముకోవడంతో రహదారులపై కనీసం ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించని (జీరో విజిబిలిటీ) పరిస్థితి తలెత్తింది. దీంతో ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం ఏర్పడి, జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఇసుక తుఫాన్కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం బికనీర్లో కూడా ఇలాంటి తుఫానే బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.
జూన్ 16 నుంచి వర్షాలు: వాతావరణ శాఖ
మరోవైపు, ఈ వాతావరణ మార్పులపై జైపూర్ వాతావరణ కేంద్రం (IMD) వివరాలు వెల్లడించింది. అరేబియా సముద్రం నుంచి వస్తున్న తేమ, చురుకైన పశ్చిమ అవాంతరాల (Western Disturbances) ప్రభావంతో రాష్ట్రంలో ఈదురు గాలులు, వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. జూన్ 16 నుంచి రుతుపవనాలకు ముందు (ప్రీ-మాన్సూన్) వాతావరణం మరింత చురుకుగా మారుతుందని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, దీంతో తీవ్రమైన ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం లభిస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే అజ్మీర్, కోటా, టోంక్, దౌసా, చిత్తోర్గఢ్ తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఇసుక తుఫాన్లు నమోదయ్యాయి.






